సినిమా టికెట్ల ధరల రచ్చ-జగన్ పని సులుపుచేస్తున్న టాలీవుడ్-అంతా అనుకున్నట్లే
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై అంతా ఊహించినట్లే టాలీవుడ్ అడుగులేస్తోంది. ఓవైపు సినిమా టికెట్ల తగ్గింపుపై రచ్చ జరుగుతున్న వేళ నాయకత్వం కరవైన టాలీవుడ్ ఇష్టారాజ్యంగా చేస్తున్న వ్యాఖ్యలు జగన్ సర్కార్ పని సులువు చేసేస్తున్నాయి. ఇప్పటికీ సినిమా టికెట్ల ధరలపై తన నిర్ణయానికే కట్టుబడిన వైసీపీ ప్రభుత్వంతో లాబీయింగ్ చేయాల్సిన నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు వినిపిస్తున్న భిన్నస్వరాలు జగన్ సర్కార్ కు ఊరటనిస్తున్నాయి.
సినిమా టికెట్ల రచ్చ
ఏపీలో సినిమా టికెట్ల అమ్మకాలు, వాటి ధరల నిర్ణయంపై ఎన్నడూ లేనంత రచ్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వందలాది సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. ఈసారి ప్రేక్షకుల కోణంలోకి వెళ్లి వారికి సినిమా టికెట్ల ధరలను తగ్గించాలని తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ కు ససేమిరా నచ్చలేదు. అయితే దానిపై పోరాటం చేసేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేని పరిస్ధితి. దీంతో లోలోపలే మథనం. అలా ఎన్నాళ్లు. అందుకే హీరోలు నాని, సిద్ధార్ధ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక్కొక్కరుగా ముందుకొచ్చి స్వరాలు వినిపిస్తున్నారు. అయితే వీటికి కౌంటర్లు అదే స్ధాయిలో ఉంటున్నాయి.
టాలీవుడ్ భిన్నస్వరాలు
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ లో ఎన్నడూ లేనంత దారుణంగా భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరోలు నాని, సిద్ధార్ధ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంటివారు టికెట్ల రేట్ల తగ్గింపును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ప్రధాన హీరోల్లో ఒకరైన నాగార్జున దీంతో తనకొచ్చిన నష్టమేమీ లేదని తేల్చిచెప్పేశారు. టాలీవుడ్ పెద్దన్నగా ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారని భావించిన చిరంజీవి కాస్తా చేతులెత్తేశారు. తనకు ఆ పాత్ర వద్దంటూ ఈ వివాదానికి దూరంగా ఉంటున్నారు. మరికొందరు హీరోలు, దర్శకులు స్పందించాలని ఉన్నా వైసీపీ ప్రభుత్వం నుంచి ఎదురుదాడికి భయపడి మౌనంగా ఉండిపోతున్నారు.
జగన్ పని మరింత సులువు
సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ లో ఎప్పుడైతే భిన్నస్వరాలు వినిపించడం మొదలైందో అప్పుడే వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ఆటోమేటిగ్గా ఆమోదముద్ర పడిపోయినట్లే అవుతోంది. ఎందుకంటే టాలీవుడ్ మొత్తంగా ఈ సమస్యను లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే ప్రభుత్వం ఇరుకునపడేది. తన నిర్ణయం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ టాలీవుడ్ లో చీలికతో జగన్ సర్కార్ పని సులువుగా మారిపోతోంది. అందుకే టాలీవుడ్ పెద్దల మౌనాన్ని, కొందరి విమర్శల్ని సైతం వైసీపీ సర్కార్ లైట్ తీసుకుంటోంది.
Recommended Video
జగన్ అనుకున్నదే జరగబోతోందా ?
సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న భిన్నస్వరాలు వైసీపీ సర్కార్ కు భారీ ఊరటనిస్తున్నాయి. ఈ వివాదంలో టాలీవుడ్ ఐక్యంగా పోరాడటం కష్టమని అంచనా వేసిన జగన్ తెలివైన ఎత్తుగడే వేశారు. దీంతో టాలీవుడ్ ఈ విషయంలో ఐక్యంగా ముందుకు రావడం లేదు. దీంతో జగన్ సర్కార్ అనుకున్నట్లే టికెట్ రేట్లను తమ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కమిటీ ద్వారా తగ్గింపుకే మొగ్గు చూపే అవకాశముంది. దీనికి హైకోర్టు కూడా నో చెప్పలేని పరిస్ధితి. ఎందుకంటే హైకోర్టు సూచన మేరకు ఏర్పాటు చేసిన కమిటీయే కావడం, ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టే రిపోర్ట్ ఇస్తుందన్న అంచనాలు.. ఇలా ప్రతీదీ ఇప్పుడు జగన్ కంట్రోల్ లోకి వచ్చేశాయి. ఇక టికెట్ రేట్ల తగ్గింపును టాలీవుడ్ ఆమోదించక తప్పని పరిస్ధితి.