ఆనందయ్య కరోనా మందుకు హీరో జగపతి బాబు మద్దతు-ప్రకృతి తల్లే మనల రక్షించేందుకు వచ్చిందని...
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై అల్లోపతి వైద్యులు ఎన్ని విమర్శలు చేస్తున్నా... సామాన్యం జనం మాత్రం ఆయన మందు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతినివ్వాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆనందయ్య మందుకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా మద్దతు పలుకుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఆనందయ్య మందుకు మద్దతు తెలిపారు.
'ప్రకృతి తల్లి మనల రక్షించడానికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆనందయ్య గారి మందుకు అధికారిక అనుమతులు రావాలని,ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. ఆయనకు భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి.' అని జగపతి బాబు ట్వీట్ చేశారు.
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కూడా ఆనందయ్య మందుకు ఇప్పటికే మద్దతు పలికారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణాన్ని నిలబెట్టేది ఆయుర్వేదం అయినా,అల్లోపతి అయినా,హోమియోపతి అయినా... ఏదైనా మహాద్భుతమే అని రఘు కుంచె తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఒక్క పైసా తీసుకోకుండా తాను తయారుచేసిన ఔషధాన్ని పంపిణీ చేస్తున్న ఆనందయ్యకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు.
ఆనందయ్య కరోనా విరుగుడు పేరుతో ఇస్తున్న మందును ఇప్పటికే ఆయుష్,ఐసీఎంఆర్ బృందాలు పరిశీలించిన సంగతి తెలిసిందే. ఆయుష్ కమిషనర్ రాములు ఆనందయ్య మందులో ఎటువంటి హానికారక పదార్థాలు లేవని స్పష్టం చేశారు. కంటిలో వేసే చుక్కల మందులోనూ సాధారణంగా ఇంట్లో ఉపయోగించే పదార్థాలే వాడుతున్నారని చెప్పారు. కాబట్టి ఆ మందు హానికారకం కాదన్నారు. అయితే పూర్తి స్థాయి అధ్యయనం,నివేదికలను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం మందుపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఐసీఎంఆర్ బృందం ఆనందయ్య మందుపై ఇంకా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆయుర్వేద కాలేజీ కూడా ఆనందయ్య మందుపై అధ్యయనం మొదలుపెట్టింది. ఈ మందుపై క్లినికల్ ట్రయల్స్ కూడా చేపట్టాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు చెప్పారు. పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత నివేదికను పంపించనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లోగా నివేదిక అందించే అవకాశం ఉందన్నారు. ఐసీఎంఆర్ నివేదిక,ఆయుర్వేద కాలేజీ ఇచ్చే నివేదికలను పరిశీలించాక ప్రభుత్వం మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
మరోవైపు ఆనందయ్య మందు పంపిణీకి అనుమతించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. మంగళవారం(మే 25) దాఖలైన రెండు పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 27న వీటిపై విచారణ జరపనుంది.
Looks like mother nature has come to our rescue. Praying that #Anandayya garu's therapy is authentically approved and will save the world. God bless him pic.twitter.com/fvF1ydYqzS
— Jaggu Bhai (@IamJagguBhai) May 25, 2021