లక్ష్మీనారాయణ జనసేనకేనా? టచ్లో బీజేపీ!, వీఆర్ఎస్కు అసలు కారణం ఇదేనా?
Recommended Video

హైదరాబాద్: గురువారం స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకే స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు జేడీనీ తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

నిజాయితీకి మారుపేరుగా సంచలనం
నిజాయితీకి మారుపేరుగా నిలిచిన లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా శ్రీశైలం. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసుల దర్యాప్తుతో ఒక్కసారిగా ఆయన వెలుగులోకి వచ్చారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా జగన్ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆయన పేరు మార్మోగిపోయింది.

యువతకు స్ఫూర్తినిస్తూ..
డిప్యుటేషన్ తర్వాత తిరిగి ఆయన మహారాష్ట్ర వెళ్లిపోయారు. మరోవైపు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా ఉన్నారు. ఏపీ తెలంగాణలో పలు కార్యక్రమాలు చేపట్టారు. యువతకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేస్తూ.. సామాజిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు.

వీఆర్ఎస్ దరఖాస్తుతో మరోసారి
గురువారం వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన లక్ష్మీనారాయణ ఇప్పుడు మరోసారి వార్తల్లోని వ్యక్తి అయ్యారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజకీయాల్లోకి వచ్చేందుకే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

జనసేనా? బీజేపీనా?
జనసేనతో కలిసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు లక్ష్మీనారాయణతో బీజేపీ నేతలు కూడా టచ్లో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనను ఎలాగైనా పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం.

అసలు కారణం ఇదేనా?
కాగా, లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీలో చేరినా.. టీడీపీకే ప్రయోజనమని ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అయితే, తన రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలను లక్ష్మీనారాయణ కొట్టిపడేసినట్లు తెలిసింది. వ్యక్తిగత కారణాలతోనే లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.












Click it and Unblock the Notifications