సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు: కేసీఆర్ 'భారీ' ప్లాన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చుట్ట 60 నుండి వంద అంతస్తుల ఎత్తులో ఆకాశహర్మ్యాలు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసీఆర్ బుధవారం నమూనాలను పరిశీలించారు. పలు టవర్ల నమూనాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుస్సేన్ సాగర్ హైదరాబాదుకు ఓ వరం అన్నారు. సాగర్ చుట్టు ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామని చెప్పారు. హుస్సేన్ సాగర్ను మంచి నీటి సరస్సుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సాగర్ చుట్టు వంద అంతస్తుల వరకు టవర్స్ నిర్మించి, మణిహారంగా మార్చుతామన్నారు.
సంజీవయ్య పార్క్, డీబీఆర్ మిల్స్, బోట్స్ క్లబ్, అంబేడ్కర్ నగర్, లుంబినీ పార్క్, జలవిహార్ స్థలాలకు సంబంధించి అధికారులు పూర్తి సమాచారం సిద్ధం చేయాలని సూచించారు. సింగపూర్లోని పెట్రోనాస్ టవర్లలా హుస్సేన్ సాగర్ చుట్టు ప్రభుత్వం భారీ టవర్స్ నిర్మించే ప్రణాళికలు చేస్తోంది.
దీనిని ప్రభుత్వమే నిర్మించి లీజుకు ఇచ్చే విషయమై ఆలోచిస్తోందని చెప్పారు. హుస్సేన్ సాగర్ చుట్టూ పేదలు నివసిస్తున్నారని, వారికి ప్రభుత్వమే టవర్స్లో వసతి కల్పిస్తుందని చెప్పారు. నిర్మాణ బాధ్యతలు ఇతర సంస్థలకు ఇవ్వాలా అనే దాని పైన ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు.
ఎండాకాలంలో సాగర్లో నీటిని ఖాళీ చేసి శుభ్రం చేయాలన్నారు. సాగర్లోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలోని ఆకర్షణీయమైన నగరాలకు బహుళ అంతస్తుల భవనాలు కూడా ముఖ్యమైనవి అన్నారు. తెలంగాణలోను అలా తీర్చిదిద్దాలనే తపన ఉందన్నారు. కోర్టు వివాదాలు ఉంటే పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.
బహుళ అంతస్తులను నిరోధించే నిబంధనలను కూడా మారుస్తామని కేసీఆర్ చెప్పారు. అండర్ డ్రెయినేజీ సిస్టంను మెరుగుపర్చాలన్నారు. సర్వే చేసి లే అవుట్లు సిద్ధం చేయాలన్నారు. జలవిహార్ పక్కన స్థలంలో అద్భుతమైన భవంతులు నిర్మించవచ్చునని తెలిపారు. అంతర్జాతీయస్థాయి వినోద కేంద్రాలు నిర్మించాలన్నారు.