విజయమ్మకు రేవంత్ భారీ షాక్ : ఆత్మీయ సదస్సుపై కీలక నిర్ణయం : ఏఐసీసీ సైతం-ఏం జరుగుతోంది..!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి విజయమ్మ ఈ సాయంత్రం ఒక ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసారు. వైఎస్సార్ మరణించి నేటికి 12 ఏళ్లు పూర్తవుతోంది. ప్రతీ ఏడాది నివాళికే పరిమిమతం అయ్యే వారు. ఈ సారి హైదరాబాద్ కేంద్రంగా వైఎస్సార్ ఆత్మీయులతో సమావేశం ఏర్పాటు చేయటం పైన తొలి నుంచి రాజకీయ చర్చ సాగుతోంది. ఇది రాజకీయాలకు అతీతమని... వైఎస్సార్ కు సన్నిహితులను ఆహ్వానిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ కు బాగా ఆత్మీయంగా వ్యవహరించిన వారికి విజయమ్మ నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించారు.
ఏపీ-తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం..
అందులో వైఎస్సార్ తో కలిసి కాంగ్రెస్ లో పని చేసిన నేతలు..అదే విధంగా అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా..ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉన్న వారికి విజయమ్మ ఆహ్వానాలు పంపారు. ఇప్పటికే వైఎస్ ఆత్మీయుడు కేవీపీ అధికారికంగా ప్రకటన చేసారు. తాను విజయమ్మ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తున్నానని గాంధీ భవన్ వేదికగానే ప్రకటించారు. అయితే, గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కు నివాళి అర్పించారు. అయితే, విజయమ్మ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవటం పైన ఏపీ-తెలంగాణ పీసీసీ అధ్యక్షులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయ ప్రేరేపిత సమ్మేళనంగా పేర్కొంటూ..
ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లవద్దు అని టీపీసీసీ సూచన చేసింది. విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం రాజకీయ ప్రేరేపిత సమ్మేళనంగా రేవంత్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి- ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ తో పాటుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి తీస్కున్న నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనవద్దు అని సూచన చేసారు. ఎవరు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న అది వారి వ్యక్తిగతమని... ఏఐసీసీ ఈ విషయాలను పరిశీలిస్తోందని స్పష్టం చేసారు.
విజయమ్మ ఆలోచన పైన భిన్నాభిప్రాయాలు..
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన సూచనల మేరకే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే, వైఎస్సార్ తో కలిసి పని చేసిన వారిలో ఎక్కువ మంది ఇప్పుడు టీఆర్ఎస్ -బీజేపీలోకి వెళ్లారు. వారందరికీ విజయమ్మ ఆహ్వానాలు పంపారు. అదే విధంగా సినిమాతో పాటుగా ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణ లో షర్మిలను బలోపేతం చేసే క్రమంలో భాగంగా వైఎస్సార్ అభిమానులను దగ్గర చేసేందుకు విజయమ్మ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారనే రాజకీయ చర్చ సాగుతోంది.
రేవంత్ తొలి నుంచి అదే వ్యూహంలో..
దీంతో..తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ..వైఎస్సార్ ను కాంగ్రెస్ నేతగానే ప్రచారం చేసి ఆయన అభిమానుల ఓట్లు తామే దక్కించుకోవాలని భావిస్తోంది. రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన సమయం నుంచి ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో..ఏపీ లోనూ పలువురు నేతలు ఉన్నా..వారిలో చాలామంది ఇప్పుడు జగన్ తో కలిసి ఉన్నారు. జగన హాజరు కాని సమావేశానికి ఏపీ నేతలు హాజరు కావటం లేదు. అందునా ఏపీ కాంగ్రెస్ సైతం పార్టీ నేతలను ఈ సమావేశానికి హాజరు కావద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Recommended Video
పాల్గొనేదెవరు..విజయమ్మ ఏం చెబుతారనేదే ఆసక్తిగా..
అయితే, ఎవరూ పాల్గొన్నా అది వారి వ్యక్తిగతంగా భావిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో..విజయమ్మ సమావేశానికి నాడు వైఎస్సార్ తో కలిసి పని చేసిన కాంగ్రెస్ నేతల హాజరు పైన సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం తెలంగాణ సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క వైఎస్సార్ హాయంలో చీఫ్ విప్ గా ని చేసారు. అదే విధంగా ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న శైలజానాద్ సైతం వైఎస్సార్ హాయంలో విప్ గా వ్యవహరించారు. పార్టీ నిర్ణయంగా చెబుతున్న సమయంలో మిగిలిన నేతలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. మొత్తంగా ఈ నిర్ణయం మాత్రం విజయమ్మ నిర్వహిస్తున్న సమావేశం పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.