సంక్రాంతి సమయాన...రాష్ట్ర వేడుకగా...కన్నుల పండుగగా...'దివిసీమ పడవల పోటీలు'
అమరావతి: రాష్ట్రంలో స్థానిక పండుగలు...సాంప్రదాయ పోటీలకు కూడా మంచి ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకర్షించాలనేది సిఎం చంద్రబాబు ఆలోచన. ముఖ్యమంత్రి ఆలోచనలను పర్యాటకశాఖ తూచా తప్పకుండా అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏటా సంక్రాంతి సమయంలో దివిసీమలో జరిగే సాంప్రదాయక పడవ పోటీలను ఈ ఏడాది రాష్ట్ర పర్యాటక శాఖ ఘనంగా నిర్వహించింది.
కృష్ణా నది సముద్రంలో కలిసే నాగాయలంక, హంసలదీవి వద్ద బ్యాక్ వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఏటా సంక్రాంతి పండుగ సమయంలో ఇక్కడ నాగాయలంక, కోడూరు మండలాల్లోని మత్య్సకార యువత 'పడవల పోటీలు' నిర్వహిస్తుంది. ఈ పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. దీనిపై దృష్టిపెట్టిన రాష్ట్ర పర్యాటక శాఖ దివిసీమ పడవల పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించి రాష్ట్రవ్యాప్త ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఈ పోటీలకు 'దివిసీమ పడవల పోటీ'గా నామకరణం చేసిం వీటి కోసం రూ.25 లక్షలను కేటాయించింది.

మత్స్యకారుల కోసం...మిగతా ప్రపంచానికి చాటేందుకు
తరతరాలుగా సముద్రాల్లోను, నదుల్లోనూ సంప్రదాయ పడవల్లో సంచరిస్తూ చేపలను వేటాడే జీవన విధానం మత్స్యకారులది. కాలక్రమంలో మరుగున పడిపోతున్న మత్స్యకారుల ప్రాచీన సంస్కృతిని, ప్రతిభాపాటవాలను మిగతా ప్రపంచానికి చాటి చెప్పేందుకు, మత్స్యకారుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి దివిసీమ సంప్రదాయ పడవల పోటీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఏడాది కేరళలో నిర్వహించినట్లే మన రాష్ట్రంలో కూడా ప్రతి సంక్రాంతికీ నాగాయలంకలో సంప్రదాయ పడవల పోటీలను నిర్వహించడంపై అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

దివిసీమ పడవల పోటీలు...రాష్ట్ర వేడుక...
నవ్యాంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రాంతంలో సంప్రదాయంగా జరిగే పడవల పోటీలను రాష్ట్ర వేడుకగా గుర్తించింది. గత ఏడాది ఈ మేరకు నిర్ణయం జరిగి నిధులను సైతం మంజూరు చేశారు. దీంతో ఈ ఏడాది రాష్ట్ర స్థాయి పడవల పోటీల్లో భాగంగా సంప్రదాయ కోల పడవలు, కేరళ తరహా డ్రాగన్ పడవ పోటీలు, భార్యాభర్తలు సంప్రదాయంగా చేసే వేటను ప్రతిబింబింప చేసే మెడ్డుడు పడవ పోటీలను కూడా నిర్వహించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ దగ్గరుండి పోటీల నిర్వహణ కార్యక్రమాలు పర్యవేక్షించారు.

ప్రైజ్ మనీతో పాటు...పాల్గొన్న వారందరికి బహుమతి...
ఈ పోటీలో మొత్తం150 పడవలు పాల్గొనగా ప్రధానంగా 3 కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. కోల, మెడ్డుడు, డ్రాగన్ విభాగాల్లో పోటీలు జరుగగా విజేతలకే కాకుండా పొల్గొన్న ప్రతి జట్టుకు బహుమతి ఇవ్వడం విశేషం. కనీస బహుమతి వెయ్యి రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు ప్రైజ్ మెనీ అందచేస్తుండటం పై మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.

పోటీలు ఇలా...జట్లు అలా...
మొత్తం 21 బృందాలు కోలల పోటీల్లో తలపడ్డాయి. పడవ నెట్టుడు పోటీల్లో 45 మంది మూడు బృందాలుగా ఏర్పడి తలపడ్డారు. డ్రాగన్ పడవ పోటీలో 44 మంది 11 బృందాలుగా మొత్తం నాలుగు రౌండ్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు.

ప్రధాన ఆదాయవనరుగా...పర్యాటక రంగం...
పర్యాటక రంగానికి అనువైన పరిస్థితులు ఉంటే ఆ దేశానికి, రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడంలో ఆ రంగానికి మంచి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ప్రజలకూ మనోఉల్లాసం,వినోదం లభిస్తుంది. ఇక ఇతర ప్రాంతాల, రాష్ట్రాల,దేశాల పర్యాటకులను ఆకట్టుకోగలిగితే ఊహించని ఆదాయం సమకూరుతుంది. కొన్ని రాష్ట్రాలు కేవలం పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలను నడిపిస్తుండటం కూడా మనం గమనించవచ్చు. అలాంటివాటిలో పర్యాటకుల స్వర్గధామంగా గుర్తింపు పొందిన కేరళ రాష్ట్రం కూడా ఒకటి.

అదే బాటలో...ఎపి కూడా...
అదే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటక శాఖను ప్రధాన ఆదాయ వనరుగా మలచాలని సిఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పర్యాటక శాఖ కూడా ఒక్కో అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ...ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది.

అంతకుముందు...సంక్రాంతి సంబరాలు కూడా...
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సాగే దివిసీమ సంప్రదాయ పడవపోటీలకు ముందు స్థానిక శ్రీరామ పాదక్షేత్రం వద్ద గల పుష్కర ఘాట్ సంక్రాంతి సంబరాలకు వేదికగా నిలిచింది. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో స్వచ్ఛ నాగాయలంక, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పంచాయతీ సంయుక్త సహకారంతో ఈ వేడుకలు అత్యంత వైభోపేతంగా జరిగాయి. బుద్ధప్రసాద్ ఆయన సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో తొలుత భోగి మంటలు ప్రారంభించారు. అనంతరం మహిళల ముగ్గుల పోటీలు, లెమన్ అండ్ స్పూన్, టగ్ ఆఫ్ వార్, పురుషులకు బాటురాయి ఎత్తడం వంటి వివిధ పోటీలను నిర్వహించారు.












Click it and Unblock the Notifications