విజయవాడలో రేపు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు- ఎక్కడెక్కడ ఎలా అంటే ?
విజయవాడలో రేపు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని బందరు రోడ్డులోని స్వరాజ్ మైదాన్ లో ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు హాజరు కాబోతున్నారు. దీంతో భారీ ఎత్తున వాహనాల రద్దీ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 6గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ ఈ ఆంక్షలు అమలుచేస్తున్నారు.
రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీం పట్నం నుంచి జీ కొండూరు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాల్ని కూడా హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, అవనిగడ్డ, రేపల్లె, చీరాల, ఒంగోలు మీదుగా మళ్లిస్తారు.

గుంటూరు నుంచి విశాఖ వెళ్లే వాహనాల్ని బుడంపాడు నుంచి తెనాలి, వేమూరు, అవనిగడ్డ, గుడివాడ, జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల్ని బాపట్ల జిల్లా మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తారు.

విజయవాడ నగరంలోనూ ఆర్టీసీ బస్సుల్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మళ్లిస్తారు. విశాఖ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్ని రామవరప్పాడు రింగ్, బెంజి సర్కిల్ మీదుగా బస్టాండ్ కు పంపుతారు. బందరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు తాడిగడప, ఎనికేపాడు, రామవరప్పాడు రింగ్ మీదుగా బస్టాండ్ కు పంపుతారు. అలాగే బస్టాండ్ నుంచి విశాఖ వెళ్లే బస్సులు పీసీఆర్ జంక్షన్, ప్రకాశం విగ్రహం, పాత ప్రభుత్వాసుపత్రి, ఏలూరు లాకులు, బీఆర్టీఎస్ రోడ్డు, పుడ్ జంక్షన్ మీదుగా రామవరప్పాడు రింగ్ వైపుకు మళ్లిస్తారు. బస్టాండ్ నుంచి బందరు వెళ్లే బస్సులు ఇదే మార్గంలో వెళ్లి ఎనికేపాడు, తాడిగడప మీదుగా పంపుతారు.













Click it and Unblock the Notifications