ప్రేమ వ్యవహారం నేపథ్యంలో కుమార్తెతో సహా తల్లిదండ్రుల ఆత్మహత్య
గుంటూరు:మీరిప్పటివరకు...ఎన్నో పరువు హత్యల గురించి చదివి వుంటారు...చూసుంటారు...కానీ ఈ ఉదంతం...పరువు ఆత్మహత్యల గురించి...ప్రేమ-పరువు ఒక కుటుంబంలో రేపిన కల్లోలం గురించి...అసలేం జరిగిందంటే...అదో ముచ్చటైన కుటుంబం...వాళ్లిద్దరూ...వాళ్లకిద్దరూ...అనురాగాలు,అనుబంధాలతో విలసిల్లే ఆ చక్కటి కుటుంబాన్ని చూసి అందరూ మనస్పూర్తిగా మెచ్చుకునేవారు...
అలాంటి కుటుంబంలో కుమార్తె ప్రేమ వ్యవహారం చిచ్చుపెట్టింది...కూతురు ప్రేమే ముఖ్యమనుకుంటే...తల్లిదండ్రులు పరువే ప్రధానం అనుకున్నారు. దీంతో ఎవరూ రాజీ పడలేక కుమార్తెతో సహా తల్లిదండ్రులు పంతానికి పోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ ముగ్గురు రైలు పట్టాలపై ముక్కలుముక్కలై కనిపించారు. దీంతో ఆత్మీయత,అనుబంధాలతో వారల్లుకున్న ముచ్చటైన పొదరిల్లు లాంటి కుటుంబం కూడా ఛిన్నాభిన్నం అయింది. ఫలితంగా ఆ కుటుంబంలోని ఏకైక వ్యక్తి ఆ దంపతుల కొడుకు అనాథగా మిగిలాడు. గుంటూరు నగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...
ముచ్చటైన కుటుంబం...
దుంగా వెంకయ్య (45), రజనీ (39) దంపతులకు కృష్ణవేణి (19), సాయిగోపీనాథ్(17) అనే ఇద్దరు సంతానం. కూతురు కృష్ణవేణి అంటే తండ్రి వెంకయ్యకు వల్లమాలిన ప్రేమ. అందుకే కూతురు ఏం చదువుతానంటే అది చదివించారు. అలా ఆ కూతురు కృష్ణవేణి ప్రస్తుతం ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది. వెంకయ్య దంపతుల మరో సంతానం కొడుకు సాయిగోపీనాథ్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వెంకయ్య గుంటూరు మిర్చియార్డులో ఎస్వీఎస్ అనే సంస్థలో ఉద్యోగం చేయడంతో పాటు సొంతంగా మిర్చి వ్యాపారం, ఫైనాన్స్ కూడా చేస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబం. అయితే వెంకయ్య బాగా సున్నిత మనస్కుడని సన్నిహితులు చెబుతున్నారు.
ప్రేమ-పెళ్లి...జరిగింది వేరు
వెంకయ్య తానెంతగానో ప్రేమించే తన కూతురు జీవితం చీకూచింతా లేకుండా సాగాలంటే తన కుమార్తెను ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చిపెళ్లి చేయాలని భావించేవారట. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు ఓ పెళ్లి సంబంధం రాగా, కుమార్తె కృష్ణవేణి అకారణంగా ఆ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆరా తీయగా ఆమె ప్రేమ వ్యవహారం కుటుంబసభ్యుల దృష్టికి వచ్చింది. ఆమె స్థానికంగా ఉన్న ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్టు గుర్తించారు. ఆ కుర్రాడు గతంలో కూతురు కృష్ణవేణిని టీజ్ చేయగా ఆ వ్యవహారం గొడవల వరకూ వెళ్లిందంటున్నారు. ఆ క్రమంలో కూతురు అదే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు తెలియడం ఆ తండ్రిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఆకతాయితనంగా జీవితాన్ని నాశనం చేసుకోబోతోందని ఆ తల్లదండ్రులు మానసిక క్షోభకు గరయ్యారు.
తాము చెప్పినట్లు...చేయాలని
దీంతో తల్లిదండ్రులు ఆ ప్రేమ వ్యవహారం వదిలేసి, తాము చూసిన సంబంధం చేసుకోవాలని కుమార్తె కృష్ణవేణిని ఒత్తిడి చేశారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఇదే విషయమై ఇంట్లో నాలుగు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. కూతురు నిర్వాకం వల్ల తమ పరువు పోయిందని తల్లిదండ్రులు భావించారు. తాము చూసిన సంబంధం చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికలను కృష్ణవేణి తేలిగ్గా తీసుకొని తాను నిర్ణయం మార్చుకోవడానికి ససేమిరా అంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ తల్లిదండ్రులు మేము చనిపోతామని ఇంటినుంచి బయలుదేరారు. ఆత్మహత్య అనంతరం తమ అడ్రస్ తెలిసేలా ఆధార్కార్డును జేబులో పెట్టుకున్నారు.
కుమార్తె...కూడా బయలుదేరింది
కుమార్తె వారించకపోగా నేను కూడా వస్తా పదండి...కలిసే చద్దామని వారితోపాటు బయలుదేరింది. ముగ్గురు కలిసి గుంటూరు బస్టాండ్ వెళ్లి బస్సుఎక్కారు. విషయం తెలుసుకున్న రజనీ సోదరుడు సాయిగోపీనాథ్ బస్టాండ్కు చేరుకుని బస్సులో ఉన్న వారిని కిందకు దించి వారించాడు. దీంతో తాము ఇంటికి వెళ్ళిపోతామని వెంకయ్య బావమరిదితో చెప్పాడు. ఆయన అప్పటికీ నమ్మకం కుదరకపోవడంతో వారితో ఒట్టు వేయించుకొని, పని మీద వెళ్లిపోయాడు. అయితే వెంకయ్య దంపతులు, వారి కుమార్తె ఇంటికి కాకుండా నేరుగా రైల్వేస్టేషన్కు వెళ్లారు. ఇంటర్ సిటి రైలు ఎక్కి ఆ రోజు రాత్రికి ఖమ్మం జిల్లా మధిర రైల్వేస్టేషన్లో దిగారు. చివరిసారిగా తండ్రి కూతురును పెళ్లి విషయం అడగ్గా కూతురు ససేమిరా అంది. దీంతో మానసిక క్షోభకు గురైన తల్లి రజనీ అటుగా వస్తున్న గూడ్స్ రైలు కిందపడిపోయినట్లు సమాచారం. ఆ ఘటన చూసిన మరుక్షణమే వెంకయ్య, కృష్ణవేణి అదే రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
అంతటా...వేదనరోదనలే
ఇంటి ముందు వరుసగా ముగ్గురి మృతదేహాలను పడుకోబెట్టడం చూసి వారి కుటుంబంలో మిగిలిన ఏకైక వ్యక్తి కొడుకు సాయినాథ్ గుండెలవిసేలా రోదించాడు. ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఏమికష్టం వచ్చిందని ఇంతఘోరానికి పాల్పడ్డారు.. ఒక్కమాట తమకు చెపితే అన్ని విషయాలూ పరిష్కరించి ఇంత కడుపుకోత జరగకుండా ముగ్గురిని కాపాడుకునేవాళ్లమంటూ వెంకయ్య కుటుంబ సభ్యులు గుండెలుబాదుకుంటూ రోధించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. వెంకయ్య దశాబ్దాలుగా మిర్చియార్డులో నమ్మకంగా ఒకే సంస్థలో పనిచేస్తూ అనేకమంది జీవితాలు బాగుచేయటానికి సాయం చేశారని, అలాంటి వ్యక్తి తమ జీవితాన్ని ఇలా అర్థాంతరంగా చాలించాల్సి వచ్చిందంటూ రోదించారు. అంత్యక్రియలకు తరలించడానికి వాహనాల్లో మృతదేహాలను ఎక్కిస్తున్న క్రమంలో పెద్ద సంఖ్యలో జనసందోహం వేదనరోదనలతో వెంటనడిచారు. వెంకయ్య,కృష్ణవేణి దంపతుల కుమారుడు సాయి చేత ముగ్గురికి అంత్యక్రియలు చేయించారు.