తూర్పు గోదావరి: ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు..తప్పిన ప్రాణానష్టం: రైళ్ల రాకపోకలకు అంతరాయం
కాకినాడ: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. రైలు ప్యాంట్రీ కార్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నడుస్తున్న రైలులో ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల గాలి వేగానికి మంటలు శరవేగంగా వ్యాపించాయి. ప్యాంట్రీ కార్ పూర్తిగా కాలిపోయింది. దీనికి ఆనుకుని ఉన్న మరో రెండు బోగీలకు కూడా మంటలు వ్యాపించాయి. దీనితో వాటిని స్టేషన్ లోనే వదిలి వేశారు. రైలును పంపించారు. బెంగళూరు-టాటానగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సోమవారం ఉదయం బెంగళూరులోని యశ్వంత్ పురా నుంచి ఉదయం 8:30 గంటలకు జార్ఖండ్ రాజధాని జంషెడ్ పూర్ కు బయలుదేరిన టాటానగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు స్టేషన్ సమీపంలో తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలు చెలరేగింది ప్యాంట్రీ కార్ లో కావడంతో ఎలాంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. ప్యాంట్రీ కార్ లో సిలిండర్ లీకేజీ వల్ల లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు.
మంటలు చెలరేగిన వెంటనే అందుబాటులో ఉన్న అగ్ని నిరోధక పరికరాలతో వాటిని నియంత్రించారు. అయినప్పటికీ.. ప్యాంట్రీ కారు సహా మంటలు వ్యాపించిన మరో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. రైలును సమీపంలోని గొల్లప్రోలు స్టేషన్ లో నిలిపివేశారు. రైల్వే భద్రతా బలగాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి వేరు చేసి, గమ్యస్థానం వైపు పంపించి వేశారు. ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.