DSC 2025: కొత్త టీచర్లకు విధులు అప్పుడే, తుది జాబితాపై అభ్యంతరాలుంటే..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలను అందించారు. ఇక, వారికి శిక్షణ...విధుల కేటాయింపు పైన ప్రభుత్వం తాజా గా తేదీలు ఖరారు చేసింది. ఇదే సమయంలో మెగా డీఎస్సీ తుది జాబితాలపై అభ్యర్ధులకు ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు అక్టోబరు 25 వరకు తెలపవచ్చని డీఎస్సీ కన్వీనర్ ప్రకటించారు. కాగా, నియామక పత్రాలు ఇచ్చిన తరువాత ఇప్పుడు అభ్యంతరాల స్వీకరణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అ సమయంలోనే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టులు ఇస్తారు. ఆ తర్వాత 13నుంచి కొత్త టీచర్లు విధులకు హాజరుకానున్నారు.

మరోవైపు మెగా డీఎస్సీ తుది జాబితాలపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు అక్టోబరు 25 వరకు తెలపవచ్చని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ, ఇద్దరు డీఈవోలతో జోనల్ కమిటీ, రాష్ట్రస్థాయి పోస్టులకు ముగ్గురు రాష్ట్రస్థాయి అధికారులతో కమిటీలను నియమించినట్లు పేర్కొన్నారు.
కాగా, ఈ కమిటీలు 15రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరిస్తాయన్నారు. అభ్యర్థులు జోనల్ స్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రాష్ట్రస్థాయి కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చని, రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయంపైనా సంతృప్తి చెందకపోతే తుది అప్పీలేట్ అథారిటీ(పాఠశాలవిద్య డైరెక్టర్)కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యాశాఖ డీఎస్సీ మెరిట్ జాబితా ప్రకారం మాత్రమే సెలక్షన్ జాబితాను ప్రకటించింది.
చివరి జాబితాపై కనీసం అభ్యంతరాలను కూడా స్వీకరించక పోవటం పైన కొందరు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో, కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వారి కోసం ఇప్పుడు అభ్యంతరాల స్వీకరణకు కమిటీలు ఏర్పాటు చేసారు. ఫైనల్ అప్పీలేట్ అథారిటీదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. అక్టోబర్ 25వ తేదీలోపు వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను 30 రోజుల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications