నెల్లూరు, ప్రకాశంలలో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం
అమరావతి: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, దుత్తలూరు మండలాలతో పాటు ప్రకాశం జిల్లాలోని పామూరు తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు.
కొన్ని చోట్ల గోడలకు బీటలు వారాయి. స్వల్ప ఆస్తి నష్టం మినహా ప్రాణ నష్టం ఏమీ జరగలేదని సమాచారం. ఇటీవలి కాలంలో నెల్లూరు జిల్లాలో పలుమార్లు భూ ప్రకంపనలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకంపనలు ప్రమాదకరమేమీ కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు.

బంగాళాఖాతంలో ఆవర్తనం: కోస్తా, సీమల్లో వర్షాలు
కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. ఇ
ఇది అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడి ముందుకు కదిలితే కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కోస్తా, రాయలసీమలో ఆదివారం అక్కడక్కడా కొద్దిపాటి వర్షాలు కురిసే వీలుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications