జగన్ అక్రమాస్తుల కేసు-సీబీఐ ముందా, ఈడీ ముందా ?- హైకోర్టు తీర్పు రిజర్వ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లను వేటిని ముందుగా విచారించాలన్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
గతంలో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ముందుగా ఈడీ ఛార్జిషీట్లపై విచారణ జరపాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించాయి. వీరి పిటిషన్ విచారణ సందర్భంగా
మొదట ఈడీ కేసులు విచారించాలన్న ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. మొదట సీబీఐ కేసులో లేదా రెండూ ఒకేసారి విచారించాలని హైకోర్టును కోరారు.

అయితే జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) సూర్యకరణ్ రెడ్డి వాదించారు. మనీలాండరింగ్ చట్టాన్ని 2019లో సవరించారని, కాబట్టి ముందుగా తాము దాఖలు చేసిన అభియోగాలపై విచారణ జరపాలని వాదించారు. ప్రధాన కేసుతో సంబంధం లేకుండా ఈడీ ఛార్జిషీట్లపై విచారణ చేపట్టాలన్నారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తమ తీర్పును రిజర్వ్ చేసింది.












Click it and Unblock the Notifications