రంగంలో త్రిదండి చినజీయర్ స్వామి: యాత్ర రూట్ మ్యాప్ రెడీ: సంక్రాంతి ముగిసిన వెంటనే
అమరావతి: రాష్ట్రంలో వరుసగా కొనసాగిన ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల పట్ల పీఠాధిపతులు స్పందించట్లేదనే విమర్శలకు బ్రేక్ పడింది. వరుస దాడులతో హిందువుల మనోభావాలు గాయపడుతున్నప్పటికీ.. పీఠాథిపతులు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదనే అనుమానాలకు త్రిదండి చినజీయర్ స్వామి తెర దించారు. పీఠాథిపతులు ప్రయోజనాల కోసం తప్ప ధర్మాన్ని పరిరక్షించడానికి పూనుకోవట్లేదంటూ వినిపించిన వార్తలపై ఆయన స్పందించారు. దాడులకు గురైన ఆలయాలను తాను సందర్శించబోతోన్నట్లు ప్రకటించారు.
సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే ఆయన బరిలోకి దిగనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి 50కి పైగా ఆలయాలను సందర్శించనున్నారు. దీనికి అవసరమైన రూట్మ్యాప్ను సిద్ధం చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం, తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది, విజయవాడ కనకదుర్గమ్మ, రొంపిచెర్ల, కొండబిట్రగుంట, రాజమహేంద్రవరం, ఉండ్రాజవరం, పిఠాపురం, గుంటూరుల్లో దాడులకు గురైన ఆలయాలను ఈ జాబితాలో చేర్చారు. సుమారు నెలరోజులకు పైగా ఈ యాత్ర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది, భక్తులతో ఆయన సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలను సేకరించనున్నారు.

ఇది పూర్తిగా ధార్మిక యాత్రగా ఉంటుందని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. రాజకీయాలు, ఆయా పార్టీల నేతల జోక్యాన్ని తీసుకోవట్లేదని తేల్చేశారు. ఆలయాలపై వరుసగా దాడులు చోటు చేసుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పీఠాధిపతులు మౌనంగా ఉన్నారనడం సరి కాదని అన్నారు. ప్రస్తుతం తాను ధనుర్మాస దీక్షలో ఉన్నానని, ఇది ముగిసిన వెంటనే దాడులకు గురైన ఆలయాలను సందర్శిస్తానని చెప్పారు. ఆలయాలకు తగినంత రక్షణ లేదనేది ఈ వరుస ఘటనలతో స్పష్టమౌతోందని, ఈ లోపాన్ని సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications