తీవ్ర తుఫానుగా వాయుగుండం: ఏపీకి భారీ వర్షాలు, హెచ్చరిక జారీ
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మరో ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మరో ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. విశాఖపట్నంకు 1180 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్పూర్కు దక్షిణ ఆగ్నేయంగా 1,210 కి.మీ, పోర్ట్బ్లెయిర్కు దక్షిణ నైరుతి దిశగా 310 కి.మీ, నికోబార్ దీవులకు పశ్చిమ వాయువ్య దిశగా 260 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉంది.
మరో 48 గంటల తర్వాత ఈ వాయుగుండం తుఫానుకుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తీరప్రాంతాల మత్స్యకారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు.
గంటకు పది కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం తీరం సమీపానికి వచ్చేకొద్దీ క్రమంగా బలపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరం వెంబడి రానున్న 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, తీరంలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తోపాటు తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాల కారణంగా 800మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. దీంతో నావికా దళం నాలుగు ఓడలతో వారిని కాపాడేందుకు బయల్దేరింది.