'డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నామం, అప్పుడూ అదే చెప్తారు'
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని ఏపీ బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు గురువారం అన్నారు. కూటమి ఏర్పడబోతుందని సంకేతాలు ఇవ్వడానికి కూడా ఈ పర్యటన అన్నారు.
కీలక పరిణామం: రాహుల్తో భేటీకి ముందు విమానాశ్రయంలో ఆజాద్తో చంద్రబాబు భేటీ
డిసెంబర్ 12న కాంగ్రెస్కూ చంద్రబాబు నామం పెడతారు
తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయని, 11న ఫలితాలు వస్తాయని, తరువాత రోజు.. డిసెంబర్ 12వ తేదీనే కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నామం పెడతారని విష్ణు చెప్పారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీతో కలిసి చారిత్రక తప్పిదం చేశానని చంద్రబాబు చెబుతారని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ అయ్యారని చెప్పారు.
టీడీపీ, కాంగ్రెస్లది అపవిత్రపొత్తు
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తు అపవిత్రమని టీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, గట్టు రామచంద్ర రావు అన్నారు. చంద్రబాబు పిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వేదికగా తెలంగాణ కబ్జాకు చంద్రబాబు సిద్ధమయ్యారని ఆరోపించారు. పరిణామాలు చూస్తుంటే ఎన్నికలు జరుగుతోంది ఏపీలోనా లేక తెలంగాణలోనా అనే అనుమానం కలుగుతోందన్నారు. యూటర్న్లు తీసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు.
Recommended Video
చంద్రబాబు ఢిల్లీ పర్యటన చారిత్రాత్మకమని తెలంగాణ టీడీపీ నేతలు
చంద్రబాబు ఢిల్లీ పర్యటన చారిత్రాత్మకమని టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. రాఫెల్ స్కాంతో భారత ప్రతిష్టను ప్రధాని నరేంద్ర మోడీ దిగజార్చారన్నారు. దేశంలో మరింత నల్లధనం పెరగడానికి ప్రధాని మోడీ కారకులు అయ్యారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మినహాయిస్తే టీఆర్ఎస్ నాయకులు ఎవరూ ప్రజలలోకి వెళ్లలేకపోతున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ గురువారం అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా అఖిలేష్ యాదవ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమీషన్ బయటపెట్టాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఇప్పటికే రూ.1000 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ పేరుతో ముందుకు వెళ్తామని చెప్పారు.
అందుకే టీడీపీ విభేదాలు పక్కన పెట్టి మాతో కలిసింది
రాహుల్ గాంధీ, చంద్రబాబుల భేటీ చారిత్రాత్మకమని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. ఏ పార్టీకి అయినా దేశ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు. బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. అందుకే విభేదాలను పక్కన పెట్టి టీడీపీ తమ పార్టీతో కలిసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎలాంటి ఫ్రంట్ ఏర్పడినా అది బీజేపీకి లబ్ధి చేకూరుతుందని అన్నారు.