ఎవరి హైకోర్టు వాళ్లకే: టి ఎంపీలు, రవిశంకర్ హామీ
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు సోమవారం లోక్సభను స్తంభింపజేశారు. మరోపక్క ప్రధాని మోడీ, తమిళనాడు సిఎం జయలలితను అసభ్య పదజాలంతో విమర్శించిన శ్రీలంక పత్రికలు, శ్రీలంక ప్రభుత్వంపై అన్నాడిఎంకె సభ్యులు తీవ్రస్థాయిలో నిరసనకు దిగడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభను రెండుసార్లు వాయిదా వేయాల్సివచ్చింది.
అన్నాడిఎంకె, తెరాస సభ్యుల నిరసనలతో లోక్సభ దద్దరిల్లింది. ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ చేపట్టినప్పుడే వీరు తమ అంశాలను ప్రస్తావించాలనుకున్నారు. స్పీకర్ విజ్ఞప్తితో అప్పుడు శాంతించిన టిఆర్ఎస్, అన్నాడింఎంకె సభ్యలు జీరో అవర్లో విజృంభించారు. రాష్ట్రం విడిపోయి రెండు నెలలు కావస్తున్నా వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయకపోవటం వెనక కేంద్రం ఉద్దేశం ఏమిటంటూ టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కె కవిత, నాగేష్, విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్, బిబి పాటిల్ తదితరులు పెద్దఎత్తున నిలదీశారు.
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రలో విలీనం చేసే ఆర్డినెన్స్ను గంటల్లో తీసుకొచ్చిన ఎన్డీయే, అత్యంత కీలకమైన హైకోర్టు విభజనను ఎందుకు చేపట్టడం లేదని వారు ప్రశ్నించారు. ఒకవైపు అన్నాడిఎంకె, మరోవైపు తెరాస సభ్యుల గొడవతో సభ దద్దరిల్లింది. రెండు సార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడూ జితేందర్ రెడ్డికి తమ వాదన వినిపించే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉండటం వల్ల ఇరు ప్రాంతాల ప్రజలకు సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
ఉమ్మడి హైకోర్టులో ప్రస్తుతం 36మంది న్యాయమూర్తులుంటే, అందులో 28మంది సీమాంధ్రులేనని, మిగతా 8మందే తెలంగాణ న్యాయమూర్తులని జితేందర్ రెడ్డి సభకు వివరించారు. మెజారిటీ న్యాయమూర్తులు సీమాంధ్రులు కావడంతో తెలంగాణకు చెందిన న్యాయవాదులకు తీరని అన్యాయం జరుగుతోందని, తెలంగాణ న్యాయవాదులు కోర్టుకు హాజరుకావటం లేదని వివరించారు. చత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలు ఏర్పాటైన రోజే హైకోర్టుల ఏర్పాటు కూడా జరిగిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విషయంలో మాత్రం కేంద్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఏపికి గంటూరు లేదా మరోచోట ఆ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలని జితేందర్ రెడ్డి సూచించారు. కేంద్రం వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రవిశంకర్ హామీ
రెండు రాష్ట్రాలకు వీలైనంత త్వరగా వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ టిఆర్ఎస్ ఎంపీలకు హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంటు ఆవరణలో రవిశంకర్ను కలిసి వేర్వేరు హైకోర్టులపై విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన విధంగా హైకోర్టును వీలైనంత త్వరగా విభజిస్తామని వారితో రవిశంకర్ చెప్పారు.