త్వరలోనే హైకోర్టు విభజన: టి ఎంపీలకు పార్లమెంటులో వెంకయ్య హామీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వీలైనంత త్వరగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం లోక్సభలో హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి జితేందర్రెడ్డి ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై వెంకయ్యనాయుడు ఈ హామీనిచ్చారు.
మంగళవారం ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే టిఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు జితేందర్ రెడ్డి ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఈ అంశంపై చర్చించాలని నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయన మాట్లాడేందుకు ఒక్క నిమిషం అవకాశం ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టును విభజించాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని, విభజన జరిగిన తొమ్మిదిన్నర నెలల తర్వాత కూడా ఈ ప్రక్రియ పూర్తి కాలేదని తెలిపారు.
సిఎం కేసీఆర్ ఈ అంశంపై మూడుసార్లు ప్రధాన మంత్రిని కలిశారని, సుప్రీం, హైకోర్టుకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా కలిశారని చెప్పారు. ఇరు రాషా్ట్రల బార్ కౌన్సిళ్ల సభ్యులు న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను కలిసి హైకోర్టును విభజించాలని కోరారన్నారు. కానీ, విభజన జరగలేదన్నారు. దీంతో చాలా కేసులు పెండింగ్ పడుతున్నాయని తెలిపారు.
మరోవైపు కొత్తగా జూనియర్ న్యాయమూర్తుల నియామక ప్రక్రియను చేపట్టారని, విభజన జరగకుండా ఈ ప్రక్రియ చేపడితే కొత్త తరం న్యాయవాదులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీంతో ఈ ప్రక్రియను న్యాయవాదులంతా బాయ్కాట్ చేశారని, ప్రస్తుతం న్యాయ వ్యవస్థ స్తంభించిందని చెప్పారు. ఈ కారణంగా తక్షణం విభజన జరిగేలా చూడాలని కోరారు. దీనికి వెంకయ్య స్పందిస్తూ.. అసాధారణ పరిస్థితిలో జితేందర్ రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారని, ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయంతో తాను కూడా ఏకీభవిస్తున్నానన్నారు.
సున్నితమైన ఈ విషయాన్ని తాను అర్థం చేసుకున్నానని, వీలైనంత త్వరగా హైకోర్టు విభజన ప్రక్రియను పూర్తి చేయాలని సదానందగౌడకు సూచిస్తానని హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ లోక్సభాపక్ష ఉపనాయకుడు వినోద్కుమార్ మాట్లాడుతూ.. హైకోర్టు విభజన అంశాన్ని తాను గతంలో ప్రస్తావించగా, న్యాయశాఖ మంత్రి స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం, హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి లేఖ రాసినా వారి నుంచి సమాధానం రాలేదని చెప్పారని తెలిపారు.
వారిరువురూ స్పందించబోరని, ఇది దురదృష్టకరమని వినోద్ చెప్పారు. దీనికి వెంకయ్య సమాధానం ఇస్తూ.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి పరిధిలో ఈ అంశం ఉందని, ఈ విషయాన్ని మరింత జఠిలం చేయొద్దని సూచించారు. తప్పకుండా హైకోర్టు విభజన సమస్యను తాము పరిష్కరిస్తామన్నారు.