గంతులు: తెరాసలోకి మరో 6గురు టిడిపి ఎమ్మెల్యేలు?
హైదరాబాద్: మరింత మంది తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తన పార్టీలోకి లాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా జుక్కల్ తెలుగుదేశం శాసనసభ్యుడు హనుమంత్ షిండే ఇటీవలే తెరాసలో చేరారు. ఆయన దారిలో మరింత మంది శాసనసభ్యులు తెరాసలో చేరుతారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తమ పార్టీలో చేరాలని కెసిఆర్ ఇచ్చిన పిలుపునకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన సుద్దాల దేవయ్య (చొప్పదండి), కెఎస్ రత్నం (చేవెళ్ల), పి రాములు (మహబూబ్నగర్), జి. నగేష్ (ఆదిలాబాద్), అన్నపూర్ణ ఏలేటి (ఆర్మూర్), సిహెచ్ విజయ రామారావు (పెద్దపల్లి) తెరాస నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చాలా మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, తమ పార్టీలో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని తెరాస నాయకులు చెబుకుంటున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీని వీడాలని కెసిఆర్ హనుమంత్ షిండే పార్టీలో చేరిన సందర్భంగా పిలుపునిచ్చాడు. కాంగ్రెసు శాసనసభ్యులు కూడా కొద్ది మంది తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెరాస నేతలు చెబుతున్నారు.
తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి 29 మంది శాసనసభ్యులున్నారు. అయితే, కెసిఆర్ రాజకీయాల వల్ల తమ పార్టీకి చెందిన ఎవరు కూడా తెరాసలో చేరడానికి సిద్ధంగా లేరని తెలంగాణకు చెందిన తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు వంటి నాయకులు అంటున్నారు.
తెరాస కాంగ్రెసులో విలీనం జరగకపోతే తెలంగాణలో బహుముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. తెరాస, కాంగ్రెసు, బిజెపి, తెలుగుదేశం పార్టీలు సిపిఐ, సిపిఎం పోటీలో ఉండే అవకాశం ఉంది. తెలుగుదేశం, బిజెపికి మధ్య పొత్తు కుదురుతుందని భావిస్తున్నారు.