తెలంగాణ బిడ్డనే, కెసిఆర్కు నమ్మకంలేకే: దాడిపై లోకేష్
మహబూబ్ నగర్/హైదరాబాద్: తాను తెలంగాణ బిడ్డనేనని, తన పైనే దాడి జరిగితే ఇక సామాన్య ప్రజలకు ఏం భద్రత ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆదివారం రాత్రి అన్నారు. పెబ్బేరులో తన పైన తెరాస కార్యకర్తలు దాడి చేసిన సంఘటన పైన లోకేష్ జడ్చర్లలో ఏర్పాటు చేసిన సభలో స్పందించారు.
తాను తెలంగాణలోనే పుట్టి పెరిగానని, ఆంధ్రా అల్లుడిని అని, రాయలసీమలో బంధువులు ఉన్నారని చెప్పారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తారా అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఆయన పైన ఆయనకే నమ్మకం లేక పార్లమెంటుకు, లోకసభకు పోటీ చేస్తున్నారని చురకలు వేశారు.
కాగా, సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పెబ్బేరులో ఆయనపై దాడి జరిగిన అనంతరం రాత్రి 9.30 గంటలకు జడ్చర్ల రోడ్షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కెసిఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వ్యవసాయం చేసి ఎకరానికి కోటి రూపాయలు సంపాదించానని చెప్పుకొన్న కెసిఆర్.. ఆయన అల్లుడు, కొడుకు, కూతురు గోనె సంచుల్లో తెచ్చిన డబ్బును మొక్కలుగా నాటి కోటి రూపాయలు సంపాదించారని ఎద్దేవా చేశారు.
దళితుడిని సిఎం చేస్తానన్న కేసీఆర్ ఆ విషయాన్ని పక్కన పెట్టి, తానే సిఎం అయ్యేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. గెలుస్తానన్న నమ్మకం లేకనే ఆయన రెండుచోట్లా పోటీ చేస్తున్నారన్నారని, హైదరాబాద్ను ఐటి రాజధానిగా టిడిపినే చేసిందన్నారు. కెసిఆర్ మాత్రం లూటీల రాజధానిగా మార్చారని ఆరోపించారు.
ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు వేలాదిమంది తెలంగాణ ప్రాంతవాసులు అక్కడ చిక్కుకున్నారని, వారిని అదుకునేందుకు కెసిఆర్ ఎందుకు ముందుకు రాలేదన్నారు. దొరల పార్టీ, డబ్బున్న పార్టీలకు ఓటేస్తే తన పైన జరిగినట్లుగానే అందరి పైనా దాడులు జరుగుతాయన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం, సామాజిక తెలంగాణ ఏర్పాటు టిడిపి, బిజెపిలకే సాధ్యమన్నారు.
కెసిఆర్పై విమర్శలు చేయడానికి తాను రాలేదని.. వాస్తవాలు చెప్పేందుకే వచ్చానన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామన్నారు.
సైబరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఐదారు జిల్లాల్లో సైబరాబాద్ల ఏర్పాటు ఆవశ్యకత ఉందని లోకేశ్ అన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెరాసది దాడులు చేసే సంస్కృతి అని, అధికారాన్ని ఇటువంటి వాళ్లకు కట్టబెడితే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని, దాడులకు భయపడనని, యాత్ర కొనసాగిస్తానని చెప్పారు.