వద్దని కేసీఆర్కు: కేంద్రంపై తెరాస స్వరం మారుతోందా?
హైదరాబాద్: విభజన సమస్యల నేపథ్యంలో కేంద్రంతో ఘర్షణాత్మక వాతావరణానికి ఆస్కారం ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందట. సామరస్యపూర్వకంగా కేంద్రంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని భావిస్తున్నారట. పోలవరం ముంపు మండలాల బదలాయింపు మొదలు గవర్నర్కు అధికారాల అప్పగింత వరకు కేంద్రం నిర్ణయాలపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలతో అమీతుమీ తేల్చుకునే విధంగా ప్రకటనలు చేస్తోంది.
దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధాని నరేంద్ర మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలను పార్టీ నేతలు బయటికి సమర్థించినా అంతర్గతంగా మాత్రం కేంద్రంపై అంత దూకుడు తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఈ నేపథ్యంలోనే, కేంద్రంపై తెలంగాణ సర్కారు వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు.
ఇందుకు సంబంధించి స్వరం మార్పుతో సంకేతాలు కూడా ఇచ్చారంటున్నారు. మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు, కేంద్రంపై ప్రభుత్వ వైఖరి వల్ల జరిగిన నష్టాన్ని నివారించే చర్యలకు పూనుకున్నారట. ఇందులో భాగంగానే ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంతో సఖ్యత కోరుకుంటున్నామని, తమ విజ్ఞప్తులపై కేంద్రం సానుకూలంగానే స్పందిస్తోందని చెప్పారంటున్నారు.
అలాగే, మోడీ ఫాసిస్టు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయటమేకాక, వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దని కోరినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈనెల 18న టీఆర్ఎస్ ఎంపీలతో కేంద్ర హోం మంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఉన్న స్వల్ప వివాదాలన్నీ తొలగిపోతాయని భావిస్తున్నారు.