గుంటూరులో త్రిముఖ పోటీ..! కానీ ఇద్దరి మద్యే ప్రధాన పోరు..!కన్నా వర్సెస్ రాయపాటి..!
అమరావతి : గుంటూరు రాజకీయాలంటే చాలామంది నేతలు గుర్తొస్తారు, అందులో ముఖ్యంగా గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు. రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ. 2014 ముందు వరకూ ఆ ఇద్దరూ కాంగ్రెస్లోనే ఉండేవారు. అయినా.. ఇద్దరి మధ్య వైరం బుసలు కొడుతుంటుంది. ఒకరు మంత్రి.. మరొకరు ఎంపీగా ఉన్నా శత్రుత్వం మాత్రం కొనసాగుతూనే ఉండేది. ఇది వర్గ వైషమ్యంగా కూడా విశ్లేషకులు భావిస్తుంటారు. ఇంతటి వైరం ఉన్న ఆ ఇద్దరూ ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో తలపడలేదు. కానీ ఇన్నేళ్ల ముచ్చట 2019 తీర్చబోతుంది.
వేడెక్కిన గుంటూరు రాజకీయం..! నువ్వా నేనా అనేతంతగా దూసుకుపోతున్న కన్నా, రాయపాటి..!!
నర్సరావుపేట టీడీపీ తరపున ఎంపీగా రాయపాటి, బీజేపీ నుంచి కన్నా లక్ష్మినారాయణ తలపడుతున్నారు. అయితే, రాయపాటి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. పైగా కమ్మ సామాజిక వర్గ నేత. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సుమారు 17 లక్షల ఓటర్లున్నారు. వీటిలో సుమారు 2.70లక్షల ఓటర్లు కమ్మ వర్గానికి చెందినవే. ఆ తరువాత స్థానంలో రెడ్డి, ముస్లిం, మాదిగ, మాల ఓటర్లు ఒక్కో వర్గం నుంచి లక్షన్నర వరకూ ఉన్నారు.
బరిలో పటిష్టంగా వైసీపి..! ప్రధాన ప్రత్యర్థులు మాత్రం బీజేపి, టీడిపి నే..!!
వైసీపీ నుంచి పోటీకి దిగిన లావు కృష్ణాదేవరాయలు కూడా కమ్మసామాజికవర్గానికి చెందిన వాడే కావటంతో కమ్మ ఓట్లలో చీలిక ఉంటుందని భావిస్తున్నారు. పల్నాట భిన్నమైన వాతావరణం ఉంటుంది. కాపు వర్సెస్ కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా రాజకీయాలు సాగుతుంటాయి. కానీ గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి వంటి నియోజకవర్గాల్లో మాత్రం కాపు, కమ్మలు కలసి ఉంటే, ఇద్దరితో రెడ్డి సామాజికవర్గానికి వైరం కొనసాగుతూ వస్తోంది. ఇది.. తమకు లాభిస్తుందని టీడీపీ అంచనా వేసుకుంటోంది.
ఎవరి ఓట్లు చీలితే ఎవరికి లాభం..! ఆసక్తికరంగా గుంటూరు పోరు..!!
అదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థికి ఎవరికి ఓటేసినా, కన్నా లక్ష్మినారాయణకు కాపు, ఎస్సీ వర్గాల్లో ఉన్న ఆదరణతో క్రాస్ ఓటింగ్ జరుగుతుందనేది కన్నా వర్గీయుల అంచనా. అయితే.. రాజకీయంగా మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యనే ప్రధానపోటీ సాగుతుందని కేవలం కన్నా లక్ష్మినారాయణ పోటీ ఓట్లు చీల్చటం వరకే పరిమితమవుతారంటూ వైసీపీ, టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
గట్టి పోటీ ఇవ్వనున్న వైసీపి..! బయటపడేది ఎవరో..!!
అయితే.. ఎవరి ఓట్లను చీల్చుతారనే విషయంలో ఇరువురి నేతల్లో గుబులు నెలకొంది. ఒకవేళ రాయపాటి కి పోలయ్యే ఓట్లను చీల్చటం ద్వారా లావు కృష్ణ దేవరాయల గెలుపునకు మార్గం వేస్తే.. రాయపాటికి దెబ్బ. అదే.. వైసీపీ ఓట్లను చీల్చితే రాయపాటికి ఉపయోగం. మరి.. దశాబ్దాల నాటి వైరానికి కన్నా బదులు తీర్చుకుంటారా! లేకపోతే.. ఇన్నాళ్ల శత్రుత్వాన్ని మరచిపోయేలా విజయాన్ని అందిస్తారా! రసవత్తరమైన పోటీలో పలనాటి తీర్పు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠతగా మారింది.