పరిషత్ ఎన్నికలపై టీడీపీ సంచలనం -బహిష్కరణంటూ లీకులు -ఎస్ఈసీ మీటింగ్ తర్వాతేనన్న అచెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష టీడీపీ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న టీడీపీ.. తదుపరి జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని భావిస్తున్నది. ఏకగ్రీవాలపై వివాదాల నేపథ్యంలోనే ఆ పార్టీ ఈ దిశగా అడుగులు వేస్తున్నది. గురువారం నాటి నాటకీయ పరిణామాల మధ్య బహిష్కరణ నిర్ణయం తీసేసుకున్నారంటూ లీకులు రాగా, వాటిపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
నిమ్మగడ్డ లేఖలోని అంశాలతో..
గతేడాది మార్చిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడే నాటికి ఏకగ్రీవాలుగా నిలిచిన స్థానాలపై అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అధికార వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందని, ఏపీలో ఎన్నికలు సజావుగా సాగాలంటే కేంద్ర బృందాలను దించాల్సిందేనని నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు లేఖ రాయడం తెలిసిందే. ప్రస్తుతం నూత ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టడం, పరిషత్ ఎన్నికలపై ఆమె ఫోకస్ పెంచడంతో.. నిమ్మగడ్డ లేఖలోని అంశాల ఆధారంగా టీడీపీ 'కొత్త నోటిఫికేషన్' డిమాండ్ ను మళ్లీ తెరపైకి తెచ్చింది. ముందుగా..
నీలంతో వర్ల భేటీ తర్వాత లీకులు..
ఎస్ఈసీగా గురువారమే బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నిని టీడీపీ నేత వర్ల రామయ్య కలిసి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఎంపీటీసీల్లో గతంలో 2 శాతం ఉన్న ఏకగ్రీవలు ఇప్పుడు 24 శాతానికి చేరాయని, జెడ్పీటీసీల్లో 0.9 శాతం గతంలో ఏకగ్రీవలు ఉంటే ఇప్పుడు 19 శాతంకు చేరాయని, ఏకగ్రీవలపై జోక్యం చేసుకోలేమని కోర్టు చెప్పినప్పటికీ ఎన్నికలు ఆగిపోయిన చోట నుంచే కాకుండా, పూర్తిగా ఫ్రెష్ నోటిఫికేషన్ తోనే నిర్వహించాలని రామయ్య డిమాండ్ చేశారు. ఎస్ఈసీతో వర్ల భేటీ ముగిసిన కొద్ది సేపటికే పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందంటూ అనుకూల మీడియాలో లీకులు వచ్చాయి...
చంద్రబాబు డిసైడ్ చేశారంటూ..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు అధినేత చంద్రబాబు నేతలకు సూచనలు కూడా చేశారని, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు నిరసనగానే పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ డిసైడైందని, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నప్పుడే రెచ్చిపోయిన అధికార వైసీపీ ఇప్పుడు నిమ్మగడ్డ లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజారుస్తాయని భావిస్తుండటం వల్లే టీడీపీ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకుందని, కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని నేతృత్వంలో జరిగే ఎన్నికలు ఏకపక్షంగానే ఉంటాయని, ఎన్నికలు పక్షపాతంగా జరుగుతున్నాయి కాబట్టే వాటిని టీడీపీ బహిష్కరిస్తున్నదని ఆ పార్టీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం అయ్యాయి. కానీ..
ఎస్ఈసీతో మీటింగ్ తర్వాతే నిర్ణయం
ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నితో టీడీపీ నేత వర్ల రామయ్య భేటీ ముగిసిన తర్వాత నుంచీ ప్రారంభమైన లీకుల వార్తలకు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఎట్టకేలకు వివరణ ఇచ్చారు. గురువారం సాయంత్రం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరిషత్ ఎన్నికల బహిష్కరణపై క్లారిటీ ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గతంలో ఆగిపోయిన చోట నుంచి కాకుండా, సరికొత్త నోటిఫికేషన్ ద్వారా నిర్వహించాలని టీడీపీ గతంలోనూ డిమాండ్ చేసిందని, అక్రమంగా జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసి, కొత్త నోటిషికేషన్ ఇవ్వాల్సిందిగా ఎస్ఈసీ నీలం సాహ్నివి ఇప్పటికే వినతి పత్రం అందిచామని, శుక్రవారం నాటి ఆల్ పార్టీ మీటింగ్ లోనూ ఇదే విషయం చెబుతామని, ఒకవేళ ప్రభుత్వం గనుక పాత నోటిఫికేషన్ ఆధారంగానే ఎన్నికలకు వెళితే అప్పుడు బహిష్కరణ నిర్ణయం వెల్లడిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. కాగా,
తొలిరోజే నీలంకు తలనొప్పులు..
ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే నీలం సాహ్నికి ఒకింత ఒత్తిడి పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రభుత్వ ఉద్దేశం మేరకు పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఆమె.. గురువారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఒక దశలో గురువారమే షెడ్యూల్ వెలువడుతుందనీ ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా 'అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే' ఎన్నికలకు వెళ్లాలని సాహ్ని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో జరిగే ఆల్ పార్టీ మీటింగ్ కు రావాల్సిందిగా అన్ని పార్టీలను సాహ్ని ఆహ్వానించారు. ఆ భేటీలో ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఎన్నికల్ని బహిష్కరించాలా? వద్దా? నిర్ణయించుకుంటామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు.
నీలం సాహ్ని తొలి భేటీ టీడీపీతోనే -ఎస్ఈసీతో వర్ల రామయ్య -కొత్త నోటిఫికేషన్కు డిమాండ్ -పరిషత్ నగారా