తిరుమల PAC-5లో దిగే వారికి టీటీడీ ముఖ్య గమనిక..!!
Tirumala: తిరుమలలో భక్తులకు కల్పిస్తోన్న శ్రీవారి దర్శనాలు, వసతి సౌకర్యాలు.. వంటి పలు అంశాలపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమగ్ర సమీక్ష నిర్వహించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో ఈ సమావేశం ఏర్పాటైంది. టీటీడీలోని దాదాపు అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఏఈఓ పలు ఆదేశాలు ఇచ్చారు.
వెంకటాద్రి నిలయం (PAC-5)లో యాత్రికులకు వేడి నీటి సరఫరా కోసం సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించారు. దీనికి అవసరమైన సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రవేశ ద్వారం వద్ద యాత్రికులు పాదరక్షలను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారని, దీన్ని నివారించడానికి స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి యాత్రికుడు ఆ మార్గం గుండా వెళ్లేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వెంకటాద్రి నిలయం లోనికి పాదరక్షలతో రాకూడదని, లోపల పరిశుభ్రత పాటించాలని యాత్రికులకు పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా నిరంతర సూచనలు ఇవ్వాలని అన్నారు. PAC-5లోని లాకర్ల, హాల్స్, కళ్యాణ కట్ట, మెడికల్ సౌకర్యాలు, అన్నప్రసాద వివరాలను రిసెప్షన్ విభాగం సమన్వయం చేసి డైనమిక్ ఇన్ఫర్మేషన్ రూపంలో పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా ప్రకటించాల్సిందిగా ఆదేశించారు. యాత్రికుల భద్రత కోసం విజిలెన్స్ విభాగం తగిన సిబ్బందిని నియమించి, సీసీ కెమెరాలను అన్ని కీలక పాయింట్లలో అమర్చాలని సూచించారు.
ఘాట్ రోడ్ల నిర్వహణ..
తిరుమల రెండో ఘాట్ రోడ్డు పై తాజాగా వేసిన బీటీ కోటింగ్ పనులపై అధికారులతో వెంకయ్య చౌదరి సమీక్షించారు. సైన్ బోర్డులు, రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మల తొలగింపు, అక్కగార్ల గుడి సమీపంలోని కొండల పైనుండి వర్షపు నీటి మళ్లింపుపై చర్చించారు. ఘాట్ రోడ్లలో ముఖ్యమైన ప్రదేశాల్లో రోడ్డు భద్రతా నిబంధనలు, NHAI ప్రమాణాలకు అనుగుణంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రోడ్ సేఫ్టీ గైడ్లైన్స్ ఉన్న సైన్ బోర్డులు స్పష్టంగా కనబడేలా అడ్డుగా ఉన్న కొమ్మలను వెంటనే తొలగించాలని ఫారెస్టు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలిపిరి నుండి తిరుమలకు నడుచుకుంటూ వస్తున్న భక్తులు అక్కగార్ల గుడి సమీపంలోని డౌన్ ఘాట్ రోడ్డులో కొండల పైనుండి పడే నీటి వల్ల అసౌకర్యం ఎదుర్కొంటున్నారని అదనపు ఈవో తెలిపారు. ఆ నీరు రోడ్డుపై పడకుండా కల్వర్టులు కట్టి కాల్వల ద్వారా అడవి మార్గంలోకి మళ్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని చీఫ్ ఇంజినీర్ సత్య నారాయణను ఆదేశించారు.












Click it and Unblock the Notifications