శ్రీవారి దర్శనం టికెట్లలో భారీగా అవకతవకలు: వేలల్లో గుర్తించిన టీటీడీ- రద్దు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం నాడు 63,095 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,127 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.72 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉండనక్కర్లేదు. క్యూ లైన్ల గుండా నేరుగా దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. శ్రావణ మాసంలో విశేష పూజలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

రద్దీ నేపథ్యంలో.. శ్రీవారి దర్శనం కోసం కొందరు భక్తులు మధ్యవర్తులను ఆశ్రయిస్తోన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. ఒక్క శ్రీవాణి ట్రస్ట్ కోటా కింద జారీ చేసిన టికెట్లల్లో దాదాపు 14,449 నకిలీ ఐడీల ద్వారా లావాదేవీలు చోటు చేసుకున్నట్లు తేల్చారు. 545 మంది యూజర్ల ద్వారా ఈ బుకింగ్స్ జరిగినట్లు నిర్ధారించారు.
ఆయా టికెట్లన్నింటినీ కూడా టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఈ సమాచారాన్ని ఆ 14,449 మంది భక్తులకు తెలియజేశారు. మరికొంతమంది యూజర్లు నకిలీ ఐడీల ద్వారా 225 శ్రీవాణి కోటా టికెట్లను బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. నకిలీ ఐడీ కార్డుల ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న వాళ్లు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ విభాగం తనిఖీలు చేస్తోంది.
స్వామివారి దర్శనం, ఆర్జితం, ఇతర సేవలు, వసతి గదుల బుకింగ్లలో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే భక్తులను కూడా టీటీడీ విజిలెన్స్ ఎప్పటికప్పుడు గుర్తిస్తోందని, మధ్యవర్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయించవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలని కోరారు. అవకతవకలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications