తిరుపతిలో పద్మావతమ్మ బ్రహ్మోత్సవం.. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆ సేవలు రద్దు!
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ధీటుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ. నేడు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
28 నుండి డిసెంబరు 6వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.దీనికోసం నవంబరు 27వ తేదీన ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారికి వాహనసేవలు జరుగనున్నాయి.

నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఈనెల 28నుంచి డిసెంబర్ 6 వతేదీ వరకు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో టిటిడి ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు బాబుస్వామి తెలిపారు నేడు ఉదయం సుప్రభాతంతో పద్మావతి అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు.
ఆలయ సంప్రోక్షణ
అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేశారు.
నేడు కల్యాణోత్సవం, ఊంజల్సేవ రద్దు, బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇలా
అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల కోసం నిర్వహించిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపధ్యంలో కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు. ఇక పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున 28వ తేదీన చిన్నశేష వాహనంపై అమ్మవారు ఊరేగుతారు. 29న పెదశేష వాహనం, హంసవాహనం, 30న ముత్యాలపందిరి, సింహ వాహనం పై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
డిసెంబర్ 5న రధోత్సవం, 6న బ్రహ్మోత్సవాల ముగింపు
డిసెంబర్ 1న కల్పవృక్ష వాహనం, హనుమద్వాహన సేవలు జరుగుతాయి.2 వ తేదీన పల్లకి ఉత్సవం, గజవాహనం, 3వ తేదీన బంగారు రథంపై అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది. సాయంత్రం గరుడ వాహనంపై ఊరేగుతారు. 4న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలను నిర్వహిస్తారు. 5వ తేదీన రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. సాయంత్రం అశ్వవాహనం, 6న తిరుచ్చి ఉత్సవం, పంచమీ తీర్థాన్ని జరుపుతారు. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.












Click it and Unblock the Notifications