TTD: ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల రద్దు - భక్తుల మధ్యకు శ్రీవారు..!!
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్దమవుతోంది. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ పైన టీటీడీ ఈవో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కీలక సూచనలు చేసారు. అక్టోబర్ 4న ద్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 12 వరకు కొనసాగనున్నాయి. ఈ సమయంలో ఆర్జిత సేవలతో పాటుగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆగస్టులో రెండు సార్లు గరుడవాహనంపై శ్రీ మలయప్ప స్వామి విహరించనున్నారు.
బ్రహ్మోత్సవాలు
ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా , అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది.

ఆర్జిత సేవలు రద్దు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇక.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్ప స్వామి వారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
రెండు సార్లు భక్తుల మధ్యకు
ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 నుండి 9 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.












Click it and Unblock the Notifications