ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం- బీఆర్ నాయుడు: రామ్ లల్లాకు పట్టువస్త్రాలు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులు బారులు తీరుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వస్తోన్నారు.
శుక్రవారం నాడు 61,142 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,736 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.15 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అయోధ్యలో పర్యటిస్తోన్నారు. పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డితో కలిసి శనివారమే ఆయన అయోధ్యపురికి చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తరువాత అయోధ్యకు రావడం ఇదే తొలిసారి.
తన పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం బీఆర్ నాయుడు దంపతులు, అయోధ్య రామ్లల్లాకు శ్రీవేంకటేశ్వర స్వామివారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. దీనితో ఉత్తరాది రాష్ట్రాల్లో గల వివిధ ఆలయాల్లో తిరుమల శ్రీవారి తరఫున పట్టు వస్త్రాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమం కోసం ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్లో మహా కుంభ మేళా సందర్భంగా త్రివేణి సంగమం సమీపంలో టీటీడీ ఏర్పాటు చేసిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారం నమూనా ఆలయం నుంచి అయోధ్యకు శ్రీవారి విగ్రహాలను తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications