తిరుమల లడ్డూపై మారిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడి అభిప్రాయం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం నాడు 51,818 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,023 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.52 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రెండు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

రథ సప్తమి కోసం తిరుమలలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా రెండు నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ పాలకమండలి సమావేశమైంది. పలు నిర్ణయాలను తీసుకుంది. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. రథ సప్తమి నాడు సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసింది.
ప్రొటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలన్నీ రద్దయ్యాయి. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఎలాంటి సిఫారసు లేఖలను కూడా టీటీడీ సిబ్బంది స్వీకరించరు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

రథ సప్తమి నాడు తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఎనిమిది లక్షల లడ్డూలను సిద్ధం చేయాల్సి ఉంటుందని టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాలక మండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు లడ్డూ తయారీ పోటును తనిఖీ చేశారు. తయారీ విధానాన్ని పర్యవేక్షించారు.
లడ్డూ తయారీలో వినియోగించే ముడిసరుకులు, నెయ్యి, చక్కర పాకం, లడ్డూలను ఉండలు పట్టే విధానాన్ని బీఆర్ నాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. రోజుకు ఎన్ని లడ్డూలు తయారవుతున్నాయని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలు తయారీ గురించీ అధికారుల వద్ద ఆరా తీశారు.
లడ్డూ తయారీ విధానం, అందులో వినియోగించే ముడిసరుకుల పట్ల బీఆర్ నాయుడు సంతృప్తిని వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధి అధికారులను అదేశించారు. ప్రతి భక్తుడికీ లడ్డూ ప్రసాదం అందేలా చూడాలని చెప్పారు.












Click it and Unblock the Notifications