టీడీపీ-జనసేన పొత్తుతో ఇబ్బంది లేదు-జగన్ మళ్లీ సీఎం అయ్యేది ఇలాగే-వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో వరుసగా భేటీ అవుతున్నారు. అలాగే బీజేపీనీ, టీడీపీని కూడా దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో పొత్తులపైనా పవన్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత , టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి పవన్ వ్యాఖ్యలపై స్పందించారు.
పవన్ కు ఒంటరిగా పోటీ చేసే శక్తి లేకే పొత్తుల కోసం ఆరాట పడుతున్నానని చెబుతున్నారని వైవీ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే పవన్ పొత్తు కుదుర్చుకోబోతున్నారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కానీ వైసీపీకి పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఇబ్బంది లేదన్నారు. వైసీపీ సొంతంగానే ముందుకెళ్తుందన్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను సంక్షేమ పథకాలే మరోసారి సీఎంను చేస్తాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇలాంటి సమయంలో జగన్ను మూడు ముక్కల సీఎంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని వైవీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ది కోసమే సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని ఆయన వెల్లడించారు.
మరోవైపు తిరుమలలో రూముల ధరల పెంపుపైనా వైవీ స్పందించారు. తిరుమలలో సామాన్య భక్తుల రూముల ధరలు పెంచలేదని, కేవలం వీఐపీల రూముల ధరలు మాత్రమే పెంచామన్నారు. అక్కడ రూ.120 కోట్లు ఖర్చు చేసి రూములు రీ మోడలింగ్ చేశామన్నారు.












Click it and Unblock the Notifications