టీటీడీకి అరుదైన గుర్తింపు: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకుగాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. శనివారం తిరుమలలో టీటీడీ పాలకమండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డికి ఆ సంస్థ భారత దేశ అధ్యక్ష్యులు సంతోష్ శుక్లా తరపున దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ అందజేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70 వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలోజరుగుతోందని సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు మూడున్నర లక్షలకు పైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారుచేసి భక్తులకు అందించడం జరుగుతోందన్నారు.
కళ్యాణ కట్టలో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది భక్తులు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇంత మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం సేవలు అందిస్తోందని చెప్పారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదం లో పరిశుభ్రమైన వాతావరణం మధ్య స్వామివారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని సుబ్బా రెడ్డి చెప్పారు. రోజు ఇన్ని లక్షల మంది విచ్చేస్తున్న తిరుమల క్షేత్రం పరిశుభ్రత, పచ్చదనానికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు.
ప్రపంచంలో ఇతర ఏ ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన బుక్కులో తిరుమలకు చోటు కల్పించిందని ఆయన చెప్పారు. టిటిడి లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరూ తాము దేవుడి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో కష్ట పడి పని చేస్తున్నందువల్లే టీటీడీకి ఈ గుర్తింపు వచ్చిందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు. సివిఎస్వో గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో చండీయాగం ప్రారంభం
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) శనివారం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా నవంబరు 21వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు చండీయాగం జరుగనుంది.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.