Tirumala: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తేల్చేసిన టీటీడీ
శ్రీవారి బ్రేక్ దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి వారానికి రెండు రోజులపాటు సిఫార్సు లేఖలు స్వీకరిస్తామంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. టీటీడీపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.
కాగా, ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై న్యాయ సలహా కోరామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి పరకామణిలో జరిగిన దోపిడీ కేసుకు సంబంధించి విజిలెన్స్ అధికారులు విచారణ పూర్తి చేశారని, త్వరలో నివేదిక అందజేస్తామని చెప్పారు.

వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు అధికా ప్రాధాన్యత ఉంటుందని, వీఐపీ బ్రేక్ దర్శనాలకు 10 రోజులపాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని చెప్పారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం కేటాయిస్తామని చెప్పారు.
ఆన్లైన్, ఆఫ్లైన్ కింద ప్రస్తుతం కేటాయించే శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోటాను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచే ఉద్దేశం లేదని ఈవో స్పష్టం చేశారు.
కాగా, బయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 31 మంది భక్తులు టెలిఫోన్ ద్వారా ఈవోకు పలు సూచనలు, ఫిర్యాదులు చేశారు. శ్రీవారి ఆలయంలో మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఈవోకు ఫిర్యాదు చేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్రీ జె.శ్యామల రావు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications