టీటీడీని బిజినెస్ సెంటర్ గా మార్చుతున్నారా..? పదివేలు కొట్టు..శ్రీవారి వీఐపి దర్శనం పట్టు: కొండ
Recommended Video
శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తుల కోసమే బ్రేక్ దర్శనం రద్దు చేసాం..ఇదీ పదే పదే టీటీడీ నూతన ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పిన మాట. దీని కారణంగా సామాన్య భక్తులకు త్వరిత గతిన దర్శనం అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో దళారీల పాత్ర కనిపించదని..దీనిని రూపుమాటపటానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దీని పైన రాజకీయ నేతల్లో అసంతృప్తి కనిపించినా..సామాన్య భక్తులు స్వాగతించారు. అయితే, ఇప్పుటు ఈవో తీసుకుంటు న్న తాజా నిర్ణయాలు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. రద్దు చేసిన వీఐపీ బ్రేక్ దర్శనం కావాలంటే.. టీటీడీ అ మలు చేస్తున్న శ్రీవాణి పధకానికి పది వేలు అందచేస్తే వీపీపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు కేటాయించే యోచన చేస్తున్నారు.
బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన సుబ్బారెడ్డి..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఇంకా పూర్తి స్థాయిలో పాలక వర్గం ఏర్పాటు కాలేదు. దీంతో..ఇప్పుడు చైర్మన్ తో పాటుగా ఈవో తీసుకుంటున్న నిర్ణయా లే అమలవుతున్నాయి. తాజాగా తిరుమలలో అమలు చేస్తున్న బ్రేక్ దర్శనం కేటగిరీలో ఉన్న ఎల్-1, ఎల్-2, ఎల్-3 దర్శనాలను రద్దు చేసారు. దీని కారణంగా సామాన్య భక్తులకు మేలు జరుగుతుందని..దర్శనం వేగంగా పూర్తి అవుతుం దని ఛైర్మన్ వివరించారు. ఇదే సమయంలో కొత్త విధానం అమల్లోకి తెస్తున్నామని..దీని కోసం కసరత్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని రాజకీయంగా కొందరు విభేదించినా..సామాన్య భక్తులకు ఊరట కలిగించింది. కేవలం ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని ఛైర్మన్ స్పష్టం చేసారు. ఈ నిర్ణయం ద్వారా ప్రతీ రోజు ఉదయం దాదాపు నాలుగు గంటల పాటు దర్శనం నిలిచిపోయేది..ఇక ఆ పరిస్థితి ఉండదు.
ఈవో చేస్తున్న తాజా ప్రతిపాదనలు..
ఇప్పటి వరకు సిఫార్సు లేఖలు ఉన్న వారికి టీటీడీ బ్రేక్ దర్శనం కల్పించేది. అయితే, ఇక నుండి సిఫార్సు లేఖలు లేకున్నా బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెబుతోంది. ఇదే సమయంలో అసలు విషయం ఏంటంటే..టీటీడీ శ్రీవాణి పధకం ద్వారా అనేక ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ముందుకు వచ్చింది. దీని కోసం విరాళాలు స్వీకరిస్తోంది. దీని కోసం ఇప్పటికే కొంత విరాళాలు వచ్చాయి. అయితే, తాజాగా తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేయటంతో.. ఎవరైనా ఈ శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళం అందజేసిన భక్తులకు... వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు కేటాయించే యోచనలో ఈవో సింఘాల్ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవాణి పథకం ద్వారా వచ్చే నిధులతో... దేశవ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి వారి ఆలయాలు టీటీడీ నిర్మించాలని నిర్ణయించింది. ఒక వైపు బ్రేక్ దర్శనం సామాన్య భక్తులకు మేలు చేయాలనే ఉద్దేశం తో బ్రేక్ దర్శనం రద్దు చేసామని చెబుతూనే..మరో వైపు పదివేలు శ్రీవాణి పధకం కింద విరాళం ఇచ్చిన వారికి బ్రేక్ దర్శన్ కల్పిస్తామని చెప్పటం ద్వారా ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారుతోంది.
ప్రభుత్వ అనుమతితోనే చేస్తున్నారా..
ఇప్పుడు ఈవో సింఘాల్ చేస్తున్న ఈ ప్రతిపాదన గురించి ప్రభుత్వానికి..ఛైర్మన్ సుబ్బారెడ్డికి తెలుసా లేదా అనే చర్చ మొదలైంది. దీనికి టీటీడీ అధికారులు కొత్త లెక్కలు చెబుతున్నారు. తిరుమలకు భారీగా విరాళాలు ఇచ్చే దాతలకు ఇప్పటికే ఏడాదికి ఒక సారి వీఐపీ దర్శనం..వసతి సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆల య నిర్మాణాల కోసం విరాళాలను ఆహ్వానిస్తున్నారు. ఆలయాల కోసం తీసుకుంటున్న విరాళాలను సేకరించటం పైన ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ, సామాన్య భక్తుల కోసం అంటూ బ్రేక్ దర్శనాలు రద్దు చేసి..ఇప్పుడు డబ్బులు ఉన్న వారు పదివేలు విరాళంగా ఇస్తే బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పటమే వివాదానికి కారణమవుతోంది. దీని ద్వారా శ్రీవారి దర్శనం పేరుతో అందునా బ్రేక్ దర్శనం పేరున పది వేలు చొప్పున ఆహ్వానించటమే ఈ వివాదానికి మూల కారణం. దీంతో..ఇప్పుడు ఈవో చేస్తున్న ఈ ఆలోచనలకు ప్రభుత్వం..ఛైర్మన్ ఆమోదం తెలుపుతారా లేదా అనేది చూడాలి.