TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ సంచలన నిర్ణయాలు ఇవే
Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడనుందని, తద్వారా శ్రీవారి దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.
తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు శ్రీవారి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్ తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.

గత కొన్నేళ్లుగా పలువురు దళారులు శ్రీవారి లడ్డూలనుబ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించామని, తిరుమలలో దళారి వ్యవస్థను అరికట్టి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందపని ఈవో శ్యామలరావు అన్నారు. ఇందులో భాగంగా, దర్శనం టోకెన్లు లేనివారికి ఆధార్ కార్డుపై రోజువారి రెండు లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించిందని అన్నారు.
అలాగే చాలా కాలంగా శ్రీవారి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు, చెన్నై, బెంగళూరు, వెల్లూరులలోని టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికి మేము పంపలేకపోయామని, ప్రస్తుతం పంపిస్తున్నామని. గత నాలుగు రోజుల్లో దాదాపు 75 వేల లడ్డూలు ఆ సమాచార కేంద్రాలకు పంపిస్తామని, దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు
తిరుమలలో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, రూ. 50 ప్రాతిపదికన భక్తులు కోరినన్ని లడ్డూలు అంటే స్టాక్ లభ్యత ఆధారంగా అందజేస్తున్నామని, దీనికి ఆధార్ కార్డు అవసరం లేదు అని టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు. ఆవు నెయ్యి నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు, సువాసన, రంగు, రుచి ఉండే నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టెండర్ షరతులను అనుసరించి నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.

అన్నప్రసాదం నాణ్యతను మెరుగుపరిచేందుకు, ప్రస్తుతం ముడి సరుకుల సేకరణ ప్రక్రియను అధ్యయనం చేయడానికి నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, త్వరలోనే కమిటీ నివేదికను అందజేస్తుందని, అదేవిధంగా, శ్రీవారి అన్నప్రసాదాల రుచిపై యాత్రికుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, శ్రీవారి ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న సేంద్రియ పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ కమిటీ నివేదిక 15 రోజులలో వస్తుందని, ఆ నివేదికను అనుసరించి తదుపరి చర్యలు చేపడతామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరి పాదాలమండపం వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసే కౌంటర్లు, గాలిగోపురం వద్ద స్కానింగ్ కౌంటర్లను త్వరలో పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు, ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీ శ్రీవారి గరుడసేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు












Click it and Unblock the Notifications