TTD: శ్రావణ మాసం వేళ అరుదైన అవకాశం - తిరుమలలో భక్తుల కోసం కొత్తగా, ఇక..!!
Tirumala: తిరుమలలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే క్యూ లైన్ మేనేజ్ మెంట్ ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తుల కు అవకాశం దక్కుతోంది. ఇక, వసతి విషయంలోనూ టీటీడీ మార్పులు చేస్తోంది. సాంకేతికతను వినియోగించి సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో కొండ పైన భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు టీటీడీ నిర్ణయించింది. ఇక, శ్రావణ మాసం వేళ వరలక్ష్మీ వ్రతానికి జూలై 31న ఆన్లైన్లో టికెట్లు జారీ చేయనున్నారు.
భక్తుల కోసం
తాజాగా తిరుమలలోని ఐదు టీటీడీ పెద్ద హోటళ్లకు టెండర్ల ఖరారయ్యాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇకపై బ్రాండెడ్ హోటళ్ల నిర్వాహకులకే టీటీడీ హోటళ్లను కేటాయించాలని టీటీడీ బోర్డు తీర్మానించిన విషయం తెలిసిందే. ఎక్కువ ధరకు టెండరు వేసే వారికి హోటళ్లను కేటాయించడం ద్వారా వారు భక్తులపై ఆ భారాన్ని మోపుతున్నారని టీటీడీ భావించింది. అందుకని ఈసారి ముందస్తు గానే హోటళ్లకు అద్దెను నిర్ణయించి కొన్ని ప్రత్యేక నిబంధనలతో ఓపెన్ టెండర్లను ఆహ్వానిం చింది. రూ.5 కోట్ల టర్నోవర్, పదేళ్ల అనుభవం, పలు ప్రాంతాల్లో హోటళ్లను సమర్థంగా నిర్వహిస్తున్నట్టు ఆధారాలు వంటి వివిధ రకాల ఆంక్షలను విధించింది.
టెండర్లు ఖరారు
ఈ క్రమంలో పెద్ద హోటళ్ల కోసం దాదాపు 102 దరఖాస్తులు టీటీడీకి అందాయి. దీంతో ఎస్టేట్, విజిలెన్స్, హెల్త్ విభాగాల ఆధ్వర్యంలో టెండర్ల కోసం వచ్చి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైంది. ఒక్కో అప్లికేషన్కు పదుల సంఖ్యలో పత్రాలను పరిశీలించారు. టీటీడీ నిబంధనల ప్రకారం అర్హులైన వారి అప్లికేషన్లను డిప్ తీయగా హైదరాబాద్కు చెందిన రెండు సంస్థలు, చెన్నై, ముంబై, గుజరాత్కు సంబంధించి సంస్థలకు టెండర్లు ఖరారయ్యాయి. వీటిని మరోసారి పరిశీలన చేసిన తరువాత బోర్డు తీర్మానం తర్వాత హోటళ్లను ఆయా సంస్థలకు అప్పగించేలా టీటీడీ అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక, తిరుచానూరులో ఆగస్టు 8వ తేదీ శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

వరలక్ష్మీ వ్రతం
ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్ వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు నేరుగా వ్రతంలో పాల్గొనేందుకు జూలై 31న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 150 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆలయం సమీపం కౌంటర్లో ఆగస్టు 7న ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల సేవ, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం సేవలను టిటిడి రద్దు చేసింది.












Click it and Unblock the Notifications