మార్కెట్లో టీటీడీ అగరబత్తులు: దేనితో తయారు చేస్తారో తెలుసా?: ప్రతి ఇంట్లో పరిమళాలు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్తగా వాణిజ్యరంగంలో అడుగు పెట్టింది. అగరబత్తీల ఉత్పత్తిని ప్రారంభించింది. తన సొంత అవసరాల కోసం అగరబత్తీలను వినియోగించుకోవడంతో పాటు మార్కెట్లో కూడా వాటిని విక్రయించబోతోంది. అగరబత్తీలసు తయారు చేయడానికి ప్రత్యేకంగా ఓ యూనిట్ను కూడా టీటీడీ అధికారులు నెలకొల్పారు. ఈ యూనిట్ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొద్దిసేపటి కిందటే లాంఛనంగా ప్రారంభించారు. అగరబత్తీలను మార్కెట్లోకి విడుదల చేశారు.

ఏఏ రకాల్లో లభిస్తాయి..
ఏడు రకాల వైవిధ్యభరితమైన సువాసనల్లో ఈ అగరబత్తీలు లభిస్తాయి. తందనాన, దివ్యపాద, అభయహస్త, దివ్య దృష్టి, దివ్య సృష్టి, ఆకృష్టి, తుష్టి అనే పేర్లతో ఈ ఏడు రకాల అగరబత్తీలు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధికారులు. ఈ ఏడింటిని రెండు కేటగిరీలుగా విభజించారు. సుగంధ భరిత అగరబత్తులు, పుష్ప పరిమళ భరిత/సహజ అగరబత్తులు కేటగిరీల్లో అవి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి.

వాటి ధర ఎంత..?
సుగంధ భరిత అగరబత్తుల కేటగిరీలో- తందనాన, దివ్యపాద, అభయహస్త రకాలను చేర్చారు. 100 గ్రాముల బరువు ఉన్న ఈ కేటగిరీలో లభించే అగరబత్తుల ధర 45 రూపాయలుగా నిర్ణయించారు. పుష్ప పరిమళ భరిత/సహజ అగరబత్తులు కేటగిరీలో- దివ్య దృష్టి, దివ్య సృష్టి, ఆకృష్టి, తుష్టి రకాలకు చెందిన అగరబత్తులను చేర్చారు. 65 గ్రాముల బరువు ఉన్న అగరబత్తుల ధర 85 రూపాయలుగా నిర్ధారించారు. వాటిని మార్కెట్లోకి విడుదల చేశారు.

దేనితో తయారు చేస్తారు..?
ఈ అగరబత్తులన్నింటినీ కూడా పుష్పాలతో తయారు చేస్తారు. తిరుమలలో వెలిసిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారికి నిర్వహించే పూజలు, అలంకరణ, సేవల కోసం వినియోగించే టన్నుల కొద్దీ పుష్పాలతో ఈ అగరబత్తులను టీటీడీ అధికారులు తయారు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ అగరబత్తుల తయారీ యూనిట్ను నెలకొల్పారు. పుష్పాలన్నింటినీ వేరు చేసి, వాటి ద్వారా ఈ ఏడు రకాల సువాసనలను వెదజల్లే అగరబత్తీలను ఉత్పత్తి చేస్తారు.

యూనిట్ సహా..
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రరెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి కొద్దిసేపటి కిందటే ఈ అగరబత్తులను విడుదల చేశారు. అగరబత్తీల తయారీ ఫ్యాక్టరీని లాంఛనంగా ప్రారంభించారు. తాము అగరబత్తీలను వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో విడుదల చేయట్లేదని, శ్రీవారి సేవలు, అలంకరణ కోసం వినియోగించిన పుష్పాలకు సంబంధించిన పరిమళాలు ప్రతి ఇంటిలోనూ వెదజల్లాలనే కారణంతో వాటిని తయారు చేశామని అన్నారు.

సొంత అవసరాల కోసం కూడా
ఈ అగరబత్తులను టీటీడీ అధికారులు తమ సొంత అవసరాల కోసం వినియోగించుకుంటారు. అంటే- రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్న టీటీడీ ఆధీనంలోని దేవాలయాల్లో పూజల కోసం ఈ అగరబత్తీలను సరఫరా చేసే అవకాశం ఉంది. వందలాది దేవాలయాలు టీటీడీ పర్యవేక్షణలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. వాటన్నింటి అవసరాల కోసం దశలవారీగా అగరబత్తీలను వినియోగిస్తారు. ఉత్పత్తికి అనుగుణంగా- దశలవారీగా వాటిని ఆయా దేవాలయాలకు సరఫరా చేస్తారు.

ఎక్కడ లభిస్తాయి..?
టీటీడీ అధికారులు కొత్తగా తయారు చేసిన ఈ అగరబత్తీలు ప్రారంభంలో పరిమితంగా లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి విస్తృతంగా మార్కెట్లో ప్రవేశపెట్టడానికి తగినంత ఉత్పత్తి చేయట్లేదు. కమర్షియల్ అవసరాల కోసం ఈ అగరబత్తీలను ఉత్పత్తి చేయకపోవడం వల్ల పరిమితంగా మాత్రమే లభిస్తాయి. తిరుమల, తిరుపతిల్లో ఎంపిక చేసిన కౌంటర్లు, దేవాలయాల్లో విక్రయిస్తారని తెలుస్తోంది. ఉత్పత్తి భారీ ఎత్తున చేపట్టిన తరువాత.. వాటి విక్రయాలను మరింత విస్తరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications