తిరుమలలో రెట్టింపు అవుతున్న అన్నప్రసాద వితరణ- భారీగా విరాళాలు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 67,767 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,852 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.07 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 10 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఇప్పటి వరకు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు అందించిన విరాళాల మొత్తం 2,200 కోట్ల రూపాయలను దాటింది. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది.
వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమితీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజులలో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు.
రూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు.
ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు.
తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టీటీడీ అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. దాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమల తిరుపతిల్లోని వివిధ కేంద్రాల్లో భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తుంది టీటీడీ.
శ్రీవారి అన్నప్రసాదంలో భక్తులకు రెండుపూటలా మసాలా వడను వడ్డిస్తోంది టీటీడీ. దీనికి భారీ డిమాండ్ నెలకొంది. రోజుకు సుమారు 75,000 నుండి 80,000 వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా వడ తయారీని కూడా పెంచుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఇవే..
- తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 1లోని 20
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 2లోని 31 కంపార్ట్మెంట్లు
- నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టీబీసీ, పీఏసీ- 2, పీఏసీ- 4 కేంద్రాలు
- శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు
- తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు
- శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం
- రుయా ఆస్పత్రి, స్విమ్స్, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి
- తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు.












Click it and Unblock the Notifications