TTD: పిల్లలతో తిరుమల వెళ్తున్నారా, టీటీడీ తాజా ఆంక్షలు - ఇక తప్పనిసరి..!!
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో టీటీడీ కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది. తాజాగా చిరుత దాడిలో బాలిక మృతి చెందటంతో నడక మార్గంలో టీటీడీ రక్షణ చర్యలు ప్రారంభించింది. నడక మార్గంలో భక్తుల అనుమతి పైన కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సాయంత్రం 6 తరువాత ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది. తాజాగా పిల్లలను నడకమార్గంలో తీసుకెళ్లటంపైన ఆంక్షలు విధించింది.
నడక మార్గంలో ఆంక్షలు : చిరుత దాడిలో బాలిక మరణించటం పై టీటీడీ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే అధికారులతో వరుస చర్చలు చేసిన ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి కీలక నిర్ణయాలు వెల్లడించారు. అటవీ సంరక్షణ చట్టాలు సమర్థవంతంగా అమలు జరుగుతున్నందువల్ల వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరిగిందని, భక్తులు వీటి బారిన పడకుండా ఎలా రక్షణ కల్పించాలనేదే టీటీడీకి ముఖ్యమన్నారు.

చిన్న పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఛైర్మన్ భూమన కోరారు. ఇదే సమయంలో ప్రత్యేకంగా పిల్లల విషయంలో టీటీడీ తాజాగా కొన్ని కీలక నిర్ణయాల అమలుతో పాటుగా ఆంక్షలను ప్రకటించింది. నడకమార్గంలో పిల్లల విషయంలో ప్రత్యేక చర్యలు మొదలు పెట్టింది.
2 గంటల తరువాత అనుమతి లేదు : చిరుతల సంచారం దృష్ట్యా తిరుమల నడకదారుల్లో పిల్లల అనుమతిపై టీటీడీ ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే, ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి ఇవాళ పోలీసు సిబ్బంది ట్యాగ్లు వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ట్యాగ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ట్యాగ్పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీసు టోల్ ఫ్రీ నంబర్ పొందుపరుస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులు వంద గాలిగోపురం నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు గుంపులు.. గుంపులుగా భక్తులను అనుమతి ఇస్తున్నారు. ముందు వెనుక రోప్ ఏర్పాటు చేసి భద్రతా సిబ్బంది సాయంతో పంపుతున్నారు. కాలిబాట మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు.

ద్విచక్ర వాహనాలు నిలిపివేత : నడక మార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో చెప్పారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నడకదారిలో ఇప్పటికే 30 మంది టీటీడీ భద్రత సిబ్బంది, 10 మంది ఫారెస్ట్ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.
రెండు నడక మార్గాల్లోపారెస్టు, పోలీస్, టీటీడీ కలిసి మరింత ఎక్కువ మందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసామని ఈవో చెప్పారు. నడకదారులలో మధ్యాహ్నం 2-3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశాలపై సాధ్యా సాధ్యాలనుపరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నడకమార్గంలో భద్రతా చర్యలను పర్యవేక్షించిన ఈవో పలు సూచనలు చేసారు.












Click it and Unblock the Notifications