టిటిడి:నోటీసులు-న్యాయపోరాటం...ఇప్పుడు మిరాశీ అర్చకుల వంతు!
తిరుపతి:దేవుడి నగలు మాయంపై సిబిఐ దర్యాప్తు విషయమై హైకోర్టు మంగళవారం టిటిడికి నోటీసులు జారీ చేసింది. దేవుడి నగలు మాయం ఆరోపణల పిటిషన్పై విచారణ జరపాలని, మూడు వారాల్లో టిటిడి తరపున కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
మరోవైపు టిటిడి తాజాగా పదవీ విరమణ అస్త్రాన్ని తిరుచానూరు ఆలయంలో పనిచేస్తున్న మిరాశీ అర్చకులపై ప్రయోగించింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న మిరాశీ అర్చకులు ఏ.సి.కృష్ణస్వామి, ఏ.బి. శేషాద్రి, ఎం.జి మురళీ లకు పదవీ విరమణ ఇస్తూ ,విధులు తప్పిస్తున్నట్లు ఆయా అర్చకుల ఇళ్లకు నోటీసులు అంటించడం జరిగింది. అయితే టీటీడీ తమను ఉన్నపళంగా తొలగించడం పై టీటీడీ మిరాశీ అర్చకులు న్యాయపోరాటానికి సిద్దం అవుతున్నట్లు తెలిసింది.
ఇదిలావుండగా చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ సాయంత్రం 5.00 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసివేయనున్నారు. ఈ విషయమై మంగళవారం పండితులు మీడియాతో మాట్లాడుతూ జూలై 27వ తేదీ శుక్రవారం రాత్రి 11.54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై జూలై 28న శనివారం ఉదయం 3.49 గంటలకు పూర్తవుతుందన్నారు.
Recommended Video
గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ అని తెలిపారు. జూలై 28న ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తామన్నారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నామని తెలిపారు. తిరిగి ఉదయం 7.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుందని చెప్పారు.