ఏడుకొండలవాడి భక్తులకు శుభవార్త: అదేమిటంటే...
తిరుపతి: ఇది నిజంగా తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్తే...భక్తుల సౌలభ్యం కోసం వివిధ సంస్కరణలు చేపడుతున్న టిటిడి తాజాగా మరో నూతన విధానాన్ని అమలులోకి తేనుంది. ఎక్కడెక్కడి నుంచో శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తులు స్వామివారిని వీలైనంత త్వరగా దర్శించాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే తండోపతండాలుగా తరలివచ్చే తోటి భక్తుల కారణంగా స్వామివారి దర్శనం అవ్వడానికి ఒక్కో సారి సుదీర్ఘ సమయం పడుతుంది.
అయితే భక్తులు కంపార్ట్ మెంట్లలో ఎక్కువ సమయం వేచి వుండకుండా, వీలైనంత త్వరగా వెంకటేశ్వరుని దర్శించుకునేలా అవకాశం కల్పించేందుకు టిటిడి సరికొత్త ప్రయోగాన్ని అమలుచేయబోతోంది. భక్తుల సర్వదర్శనం కోసం టైం స్లాట్ లను కేటాయించడమే ఈ నయా ఎక్స్ పెరిమెంట్....టిటిడి జెఈవో శ్రీనివాసరాజు నూతన విధానం అమలు గురించి శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు.

టైమ్ స్లాట్ అమలు....
భక్తులు సర్వదర్శనం కోసం సుదీర్ఘ సమయం పాటు కంపార్ట్మెంట్లో వేచి ఉండకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనం చేసుకునేందుకు టైమ్ స్లాట్ పద్దతిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామని టిటిడి జెఈవో శ్రీనివాసరాజు చెప్పారు. ఈ సమయం విభాగం పద్దతిని ఏ విధంగా అమలు చేయనున్నారనే వివరాలు అన్నమయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ఈ టైమ్ స్లాట్ విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
Recommended Video


ప్రత్యేక కౌంటర్లు...
సర్వ దర్శనం భక్తుల కోసం టైమ్ స్లాట్ విధానం అమలు చేసేందుకు వీలుగా తిరుమలలోని 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లు ఏర్పాటు చేశామని టిటిడి జెఈవో చెప్పారు. తొలివిడతగా 5 నుంచి 7 రోజులపాటు ప్రయోగాత్మకంగా భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామన్నారు.ఆధార్కార్డు ద్వారా భక్తులు ఈ సర్వదర్శనం టోకెన్లు పొందవచ్చని, టోకెన్లు పొందిన భక్తులను దివ్యదర్శనం కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ఆయన చెప్పారు. దీనివల్ల కంపార్టమెంట్లలో రద్దీ తగ్గడంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు దర్శనంలో జాప్యాన్ని నివారించవచ్చని అన్నారు.

భక్తుల ఆమోదంతో తదుపరి నిర్ణయం....
ఈ టైమ్ స్లాట్ ప్రయోగంపై భక్తుల సలహాలు,సూచనలు పరిగణలోనికి తీసుకుని రెండు నెలల తరువాత పూర్తిస్థాయిలో సమయ విభాగం విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. అయితే టైమ్ స్లాట్ విధానం ఆధార్ కార్డు ఉన్న భక్తులకు మాత్రమే అమలు చేయడం సాధ్యపడుతుందని జెఈవో తెలిపారు. ఆధార్కార్డు లేని భక్తులు యథావిధిగా సర్వదర్శనం కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications