తిరుమల భక్తులకు కన్నుల పండుగ - శ్రీవారిని ఇలా చూసే అరుదైన అవకాశం..!!
తిరుమలలో మినీ బ్రహోత్మవంగా భావించే రధసప్తమి (ఈ నెల 28) నాడు శ్రీవారు ఏడు రధాల్లో విహరిస్తూ భక్తులను దర్శనమివ్వనున్నారు.
Tirumala: మినీ బ్రహ్మోత్సవాలుగా భావించే రధసప్తమి వేడుకలకు తిరుమల సిద్దం అవుతోంది. రధ సప్తమి అయిన సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజును రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. మాఘమాసంలో మాఘ శుద్ధ సప్తమిని ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు పుట్టిన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినం నాడు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఏడు వాహనాల్లో తిరుమలేశుడు మాడ వీధుల్లో విహరించనున్నారు. ఆ రోజన ఈ వాహనాల్లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.

ఏడు వాహనాలపై స్వామి వారి దర్శనం
ప్రతీ ఏటా తిరుమలలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మినీ బ్రహోత్సవాల తరహాలో ఏర్పాట్లు చేస్తారు. ఈ సారి అదే రకంగా ఏర్పాట్లు జరుగుతన్నాయి. స్వామి వారు ఏడు వాహనాల్లో భక్తులకు దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాడ వీధుల్లో స్వామి వారి విహరించే వాహనాల సమయాలను ఖరారు చేసారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) - సూర్యప్రభ వాహనం పైన స్వామి వారి ఊరేగింపు ఉంటుంది. ఆ తరువాత ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం పైన మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు నిర్వహణకు నిర్ణయించారు. ఈ రెండు వాహనాల సేవలు తరువాత ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం లో ఊరేగింపు ఉంటుంది. మధ్నాహ్నం 2 గంటల నుంచి 3 వరకు స్వామి వారి చక్రస్నానం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక సేవలు రద్దు చేస్తూ
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం పై మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అయిదో వాహనంగా సర్వ భూపాల వాహనం పైన స్వామి వారి ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు. ఆరో వాహనంగా సర్వభూపాల వాహనం పైన సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు ఊరేగింపు ఉంటుంది. ఈ వాహనాల ద్వారానే భక్తులకు స్వామి వారి దర్శనం కలగనుంది. చివరగా రాత్రికి 8 గంటల నుంచి 9 గంటలకు స్వామి వారు చంద్రప్రభ వాహనంలో మాడ వీధుల్లో విహరిస్తారు. రధ సప్తమి పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.












Click it and Unblock the Notifications