శ్రీవారి భక్తులకు శుభవార్త- శ్రీవారి మెట్టు మార్గం పున:ప్రారంభం : అనుమతించేది ఈ సమయంలోనే..!!
శ్రీవారి భక్తులకు శుభవార్త. దాదాపు ఆరు నెలల తర్వాత శ్రీవారిమెట్టు కాలినడక మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. నడకమార్గం పున:ప్రారంభమైంది. శ్రీవారి మెట్టు వద్ద తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. భక్తులను అనుమతించారు. శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకు చేరుకునే కాలినడక మార్గమే శ్రీవారి మెట్టు. గత ఏడాది నవంబర్ 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు మెట్టు మార్గంలో పెద్ద బండరాళ్లు పడి రోడ్డు, మెట్లు, ఫుట్పాత్లు, మరుగుదొడ్లు దెబ్బతిన్నాయి.
ఆ సమయంలో ఊహించని వరద నీరు తిరుమల మాడ వీధుల్లోనూ ప్రవహించింది. ఆ నీటి ప్రవాహం కిందకు వరదలా రావటంతో మెట్ల మార్గం పూర్తిగా దెబ్బ తింది. ఘాట్ రోడ్లు మరమ్మత్తులకు గురయ్యాయి. దీంతో..అప్పటి నుంచి ఈ మార్గంలో నడక ప్రయాణాన్ని అధికారులు నిలుపుదల చేశారు. దెబ్బతిన్న మార్గాన్ని.. మెట్లను టీటీడీ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేసింది. అక్కడే ఉండే కొండ రాయితో మెట్లను తీర్చి దిద్దింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పూర్వం ఉన్న రాతి బండలతోనే మెట్టు మరమ్మతులు చేపట్టామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
అయితే, భక్తులకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడక ప్రయాణానికి అనుమతి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మెట్టు మార్గంలో భక్తులకు నిత్య ప్రసాదాలు అందజేస్తామని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతుందని ఛైర్మన్ చెప్పుకొచ్చారు. నడక మార్గాన్ని 3.60 కోట్ల రూపాయలతో మరమ్మతులు పూర్తి చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మార్గం గుండా ప్రతి రోజూ ఆరు వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారని తితిదే ఛైర్మన్ తెలిపారు.
శ్రీవారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తూ శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని ఆయన వివరించారు. ఇప్పుడు మెట్ల మార్గం అందుబాటులోకి రావటం ద్వారా.. అనేక మంది భక్తులు కాలి నడకన తిరుమల కొండకు చేరుకొనే వారికి ఇది శుభవార్తగా మారింది.