తిరుమలలో కొత్త రికార్డు - భక్తులు నేరుగా ఈవోతో..!!
తిరుమలలో మరో కొత్త రికార్డు నమోదు అయింది. వరుస పర్వదినాలు..భక్తుల రద్దీతో తిరుమల శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది.
Tirumala: తిరుమలలో మరో కొత్త రికార్డు నమోదు అయింది. వరుస పర్వదినాలు..భక్తుల రద్దీతో తిరుమల శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. కొద్ది నెలల కాలంగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతీ నెలా రూ వంద కోట్ల దాటుతోంది. కాగా, జనవరి నెలలో శ్రీవారిని 20లక్షల 58 వేల 242 మంది దర్శించుకున్నారు. జనవరి నెలలో హుండీ ఆదాయం రూ 122.68 కోట్లుగా అధికారులు వెల్లడించారు. ఇదే నెలలో 2వ తేదీన ముక్కోటి ఏకాదశి నాడు రూ 7.68 కోట్లు మేర హుండీ ఆదాయం వచ్చింది. ఒక్క రోజులో వచ్చిన ఆధిక ఆదాయం ఇదేనని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది అక్టోబర్ చివరి వారంలో తిరుమల హుండీ ఆధాయం ఒకే రోజున రూ 6.31 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం జులై 27, 2018లో 6.28 కోట్ల రూపాయలు హుండీ ఆదాయంగా లభించింది.
ఇంతకు ముందు 2012జనవరి 1వ తేదీన రూ 4.23 కోట్ల రూపాయలు రికార్డ్ ఉండగా అదే ఏడాది ఏప్రిల్1వ తేదీ రూ: 5.73 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం లభించింది.ఇప్పుడు ఆ రికార్డులను చెరిపి వేస్తూ ఒక్క రోజు హుండీ ఆదాయం 2వ తేదీన రూ 7.68 కోట్లు వచ్చింది. ఇక, వరుస పర్వదినాలతో శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య భారీ స్థాయిలో ఉంది. రధసప్తమి నాడు శ్రీవారు సప్తవాహనం పైన తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ సమయంలో శ్రీవారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రధ సప్తమి నాడు శ్రీవారిని అత్యధికంగా 80,094 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్న ట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక గత మార్చి నుంచి వరుసగా ప్రతీ నెల శ్రీవారి ఆదాయం వంద కోట్లు దాటినట్లు అధికారులు గణాంకాలు విడుదల చేసారు.
2022 మార్చిలో రూ.128.64 కోట్ల మేర హుండీ ఆదాయం సమకూరింది. ఏప్రిల్లో రూ.127.65 కోట్లు రాగా.. మేలో రూ.130.29 కోట్లు వచ్చినట్లుగా ప్రకటించారు. జూన్లో రూ.123.74 కోట్లు.. జూలైలో రూ.139.33 కోట్ల మేర హుండీ ఆదాయం సమకూరింది. ఆగస్టు నెలలోలో రూ.140.34 కోట్లు ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు ఇదే అధికంగా ఉంది. సెప్టెంబరులో రూ.122.19 కోట్లు రాగా, అక్టోబరులో రూ.122.83 కోట్లు మేర వచ్చినట్లు అధికారులు వివరించారు. నవంబరులో రూ.127.31 కోట్లు, డిసెంబరులో రూ.129.37 కోట్లు లభించింది. ఇదే సమయంలో భక్తులు నేరుగా తిరుమల ఈవోతో మాట్లాడేందుకు శుక్రవారం టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికోసం 0877 2263261 నంబరులో సంప్రదించటం ద్వారా భక్తులు ఈవో ధర్మారెడ్డితో నేరుగా మాట్లాడవచ్చు. తిరుమలకు సంబంధించిన సమస్యలు..సలహాలు నేరుగా ఈవోతో పంచుకొనే అవకాశం ఉంటుంది.