శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక... ఆరోజు నుంచి సర్వదర్శనం తాత్కాలికంగా నిలిపివేత...
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నెల 12 నుంచి తిరుమల శ్రీవారి సర్వదర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.ఈ నెల 11 వరకే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తెలిపింది. సోమవారం(ఏప్రిల్ 11) నుంచి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తామని వెల్లడించింది. ఇప్పటికే జారీ చేసిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. సర్వదర్శనం నిలిపివేతను భక్తులు గమనించి సహకరించాలని కోరింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు విధిగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.భక్తుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
కాగా,టీడీపీ ప్రభుత్వ హయాంలో వయోపరిమితి నిబంధనల కారణంగా టీటీడీ అర్చకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నవారికి తాజాగా టీటీడీ మళ్లీ ఆ హోదా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే రమణ దీక్షితులు ఆలయ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం(ఏప్రిల్ 7) మరో నలుగురు ప్రధాన అర్చకులను టీటీడీ పాలకమండలి నియమించింది.గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం తరఫున నారాయణ దీక్షితులు, పైడపల్లి నుంచి రాజేష్ దీక్షితులు, పెద్దింటి కుటుంబానికి అర్చకత్వ ప్రతినిధిగా రవిచంద్ర దీక్షితులను నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Recommended Video
సాధారణంగా శ్రీవారి ఆలయంలో తిరుపతమ్మ,గొల్లపల్లి,పెద్దింటి,పైడిపల్లి వంశాలకు చెందిన నలుగురు ప్రధాన అర్చకులుగా ఉంటారు. వీరినే మిరాశీ వంశస్తులు అంటారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలకమండలి వయోపరిమితి నిబంధనలు తీసుకొచ్చింది. 65 ఏళ్లు పైబడిన వారిని విధుల్లో నుంచి తొలగించింది. దీంతో అప్పటి టీటీడీ ప్రధాన అర్చకులైన గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులు,తిరుపతమ్మ వంశం నుంచి నరసింహ దీక్షితులు,పైడిపల్లి వంశం నుంచి శ్రీనివాసమూర్తి దీక్షితులు,పెద్దింటి వంశం నుంచి నారాయణమూర్తి దీక్షితులు, శ్రీవారి ఆలయంలోని మరో ఐదుగురు అర్చకులు విధుల్లో నుంచి తొలగించబడ్డారు.అలాగే తిరుచానూరు ఆలయంలోని పలువురు అర్చకులు కూడా విధుల్లో నుంచి తొలగించబడ్డారు.