తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికీ బీమా - వైకుంఠం క్యూకాంప్లెక్స్లో ఇక నుంచి..!!
TTD పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే తొలి సారి భక్తులకు బీమా సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సెలవుల వేళ రద్దీ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు కొత్త సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. అదే విధంగా కొత్త యాప్ తో పాటుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనూ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రారంభించనున్నారు.
టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికీ బీమా సదుపాయం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. అలిపిరి దాటిన నుంచీ భక్తులందరికీ ఈ గ్రూప్ పాలసీ వర్తిస్తుందని తెలిపారు. కొండపై సహజ మరణం పొందిన భక్తుడి కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తామని చెప్పారు. ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆలయాల పరిధిలో టీటీడీ ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. ప్రమాదాల్లో మరణించిన భక్తులకు రూ.3 లక్షలుగా ఉన్న బీమాను రూ.10 లక్షలకు పెంచామని, దీనికి రూ.17 లక్షల ప్రీమియం ఖర్చును టీటీడీ భరిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ నెల 15 నుంచి 23 వరకు సాలకట్ల, అక్టోబరు 12 నుంచి 20 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.

బ్రహ్మోత్సవాల వేళ కీలక నిర్ణయాలు
కాగా, 16న రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందజేసిన 25 విద్యుత్ బస్సులు, ఆధునికీక రించిన ఎస్వీ మ్యూజియాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుతామని అన్నారు. దేశవ్యాప్తంగా 25 రాష్ర్టాలతో పాటు సింగపూర్, జర్మనీ నుంచి కళాకారులు వాహన సేవల్లో ప్రదర్శనలిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుమలలోని జలాశయాల్లో 120 రోజుల అవసరాలకు సరిపడా నీళ్లున్నాయని చైర్మన్ తెలిపారు. శ్రీవారి పోటులో లడ్డూల తయారీని వేగవంతం చేసేందు కు మరో 400 మంది వర్కర్లను తీసుకునేందుకు ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు. నారాయణ వనంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటుకు ఆమోదం. రూ.17.05 కోట్లతో చెన్నైలోని అమ్మవారి ఆలయ ధ్వజస్తంభానికి, బలిపీఠానికి బంగారు తాపడంకు ఆమోదం తెలిపారు.
భక్తుల బీమా కోసం టీటీడీ దాదాపు రూ.3 కోట్లను రివాల్వింగ్ ఫండ్ కింద ఎల్ఐసీలోని ప్రత్యేక ఖాతాలో జమ చేస్తుంది. 15న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీ, ఎల్ఐసీ మధ్య ఈ పాలసీకి సంబంధించిన ఎంవోయూ జరుగనుంది. అదే విధంగా శ్రీవారి వైభవం, తిరుమల విశిష్టతను కళ్లకు కట్టేలా వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లలో ఎక్స్పీరియన్స్ సెంటర్ను టీటీడీ ఏర్పాటు చేయనుంది. కంపార్టుమెంట్ నం.17లో త్రీడీ, వీఆర్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ను 15న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీంతో పాటు గదుల్లో సమస్యలను తక్షణం పరిష్కరించేలా రూపొందించిన 'నందకం' యాప్ను కూడా సీఎం ఆవిష్కరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.














Click it and Unblock the Notifications
