టీటీడీ ట్రస్ట్ బోర్డ్ అత్యవసర భేటీ
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 65,095 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 26,912 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.78 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏడు కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశం కాబోతోంది. బుధవారం ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్ పాలక మండలి కార్యాలయం దీనికి వేదిక. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దీనికి అధ్యక్షత వహించనున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎక్స్ అఫీషియో మెంబర్ దీనికి హాజరు కానున్నారు.
టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, జేఈఓ వీరబ్రహ్మం పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పాలక మండలి పలు నిర్ణయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడం, శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదంలో నాణ్యతపై సమీక్షించనుంది.
భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఇటీవలే ప్రవేశపెట్టింది టీటీడీ. దీనిపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అలాగే- టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్ ఎక్స్పాన్షన్ కోసం అవసరమైన సూచనల కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు గత పాలక మండలి ఆమోదం తెలిపింది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టుపై తాజా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుపై చర్చిస్తుంది. కాలినడకదారుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించడానికి అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకంపై తుది నిర్ణయం తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications