శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు?- కారణం ఇదే
Deepavali 2024: ఇంకొద్ది రోజుల్లో దీపావళి పండగ రాబోతోంది. ఈ నెల 31వ తేదీన దేశవ్యాప్తంగా దీవాళీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు ప్రజలు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య బాణాసంచా కాల్చుతూ సందడి చేయడానికి సిద్ధమౌతున్నారు.
వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో మూడు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటుంటారు. ఛోటీ దీపావళి, మహాలక్ష్మి వ్రతం, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి శుభ కార్యాలను నిర్వహిస్తుంటారు. తోడబుట్టిన వాళ్ల క్షేమాన్ని కోరుకుంటూ భాయ్ దూజ్ను జరుపుకొనే సంప్రదాయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది.

దీపావళి పండగ నాడు తిరుమలలో ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా దీపావళి ఆస్థానాన్ని ఏర్పాటు చేయనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. శాస్త్రోక్తంగా దీన్ని నిర్వహించడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టింది.
దీపావళి నాడు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఇందులో భాగంగా దేవేరులతో కలిసి శ్రీమలయప్ప స్వామివారు ఘంటా మండపానికి విచ్చేస్తారు. సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు.
సేనాధిపతి శ్రీవిష్వక్సేనులవారిని కూడా మలయప్ప స్వామి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతుడై మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు. ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
దీపావళి ఆస్థానం కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అక్టోబరు 31వ తేదీన ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
కాగా- తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 80,741 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,581 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.45 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అయిదు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications