గుడ్ న్యూస్: తిరుమలలో భక్తుల కోసం కొత్తగా.. !!
Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. శనివారం నాడు 79,52 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 40,152 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.87 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బాట గంగమ్మ అమ్మవారి ఆలయం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ వైద్య విభాగం అధికారులు చర్యలు తీసుకున్నారు. తిరుమలలో వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
నారాయణగిరి ఉద్యానవనాల్లో రెండు, రాంబగీచ అతిథి గృహాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయం, పాపానాశనం, 7వ మైలు వద్ద ఒక్కొక్కటి చొప్పున తాత్కాలిక ప్రథమ చికిత్స కేంద్రాలను నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం తిరుమల, తిరుపతిల్లో శాశ్వతంగా టీటీడీకి చెందిన ఆరు చొప్పున డిస్పెన్సరీలు, ప్రథమ చికిత్స కేంద్రాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో ఎనిమిది హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, మందులు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్లను సిద్ధం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications