అమెరికా రాజధాని విస్తీర్ణమే అంత లేదు: తులసిరెడ్డి, సిఎంను అడ్డుకుంటామని రామకృష్ణ
కడప: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రాజధానులను నిర్మించవచ్చునని కాంగ్రెసు నాయకుడు తులసిరెడ్డి అన్నారు. ప్రపంచ అగ్ర రాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ విస్తీర్ణం 7 వేల ఎకరాలేనని ఆయన సోమవారం కడప జిల్లా వేంపల్లిలో మీడియా ప్రతినిధులతో చెప్పారు.
రైతుల పట్ల ఎపి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సిరులు పండే భూములను రాజధాని పేరుతో లాక్కుంటోందని విమర్శించారు. భూదందా కార్యక్రమంలో మునిగితేలుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను విస్మరించారని అన్నారు.
రెండేళ్ల నుంచి ఇన్పుట్ సబ్సిడీ పైసా విడుదల చేయలేదని, కనీసం రైతులకు సరిపడే విత్తనాలను కూడా పంపిణీ చేయలేక పోయారని అన్నారు. మొత్తం 9 వేల క్వింటాళ్లు అవసరం కాగా 1500 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే అందించారని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వ్యవసాయం చతికలబడుతోందని అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుంటే ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం నుంచి వామపక్షాలతో కలిసి ప్రత్యక్ష యుద్ధం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. నాయకులను ఎవరిని కూడా ఎక్కడా తిరగనివ్వబోమని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులను కూడా అడ్డుకుంటామని ఆయన చెప్పారు.
కడపలో ఆదివారం జరిగిన రెండో రోజు సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన ప్రధానితో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారని, ఇందులో రాయలసీమకు న్యాయం జరగకపోతే ప్రత్యక్ష యుద్ధానికి దిగక తప్పదని అన్నారు.
ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వారందరూ రాజకీయ నిరుద్యోగులని బిజెపి నాయకులు అంటున్నారని, గతంలో ప్రత్యేక హోదా పేరు చెప్పి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సన్మానాలు చేయించుకున్నారు కదా అని ఆయన అన్నారు.