టగ్గాఫ్ వార్, పోటాపోటీ: షెడ్యూల్ 8 నుంచి షెడ్యూల్ పదికి..
హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ఎనిమిదో షెడ్యూల్పై వివాదం జరుగుతుండగానే పదో షెడ్యూల్ తెర మీదికి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఇక పదో షెడ్యూల్పై వివాదం జరగనుంది. రాష్ట్ర విభజన చట్టంలో పదో షెడ్యూలులో చేర్చిన ప్రధాన సంస్థలన్నింటికీ తమ ప్రభుత్వం తరఫున అధిపతులను నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
అంతేకాదు, పదో షెడ్యూలు సంస్థల నిధులను ప్రత్యేక ఖాతాలకు తరలించాలని తీర్మానించుకుంది. ఇందులో భాగంగా సుపరిపాలన కేంద్రానికి (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ - సీజీజీ) డైరెక్టర్ జనరల్గా ముకేశ్ కుమార్ మీనాను నియమించింది. ఈ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే డీజీగా కె.రామకృష్ణారావును నియమించింది. ఆయన సెలవుపై వెళుతుండటంతో, ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి శివశంకర్ను ఇన్చార్జిగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జీఏడీ (పొలిటికల్) కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనాను కూడా సీజీజీ డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్గా తెలంగాణ ప్రభుత్వం వినోద్ కుమార్ అగర్వాల్ను ఇదివరకే నియమించింది. కాగా, ఏపీ ప్రభుత్వం అదే సంస్థకు లింగరాజు పాణిగ్రాహిని అధిపతిగా నియమించింది.
పదో షెడ్యూల్లోని సంస్థలపై తెలంగాణ ప్రభుత్వంతోపాటు తమకూ హక్కు ఉంటుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఉన్నత విద్యామండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, మిగతా సంస్థలకు వర్తించదని న్యాయ నిపుణులు చెప్పడంతో అన్ని సంస్థల్లోనూ తమ అధికారులు కూడా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే, మీనా బాధ్యతలు స్వీకరించేందుకు వస్తే అడ్డుకుంటామని తెలంగాణ ప్రకటించారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ జనరల్కు లేఖ రాసి, ఎప్పుడు బాధ్యతలు స్వీకరించాలో ఆయన్నే అడగాలని, ఆయన సమాధానాన్ని బట్టి అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని ఉన్నతాధికార వర్గాలు భావిస్తున్నాయి.
పదో షెడ్యూల్లో 147 సంస్థలు ఉన్నాయి. అందులో సుమారు 15 ప్రధాన సంస్థలపైనే గట్టిగా పట్టుపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్), ఎంసీఆర్హెచ్ఆర్డీ, సీజీజీలతో పాటు మరికొన్ని ముఖ్య సంస్థలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి ఉంది. ఈ వివాదం నేపథ్యంలో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలంగాణ సీఎస్ రాజీవ్శర్మతో ఫోన్లో మాట్లాడారు. పదో షెడ్యూలులోని సంస్థలన్నీ తమకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తగిన రుసుము చెల్లించి ఆ సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేవలు పొందవచ్చునని చెప్పింది.