జగన్ కాన్వాయ్ను అడ్డుకుంటామన్న బైరెడ్డి కూతురు- ఎందుకో తెలుసా ?
ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు ఫైర్బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కర్నూలు నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఈ మధ్య అంతగా వార్తల్లో కనిపించడం లేదు. కానీ ఆయన వారసురాలు బైరెడ్డి శబరి మాత్రం యాక్టివ్గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న బైరెడ్డి కూతురు శబరి సమకాలీన రాజకీయాలపై సెలక్టివ్గా స్పందిస్తుంటారు. తాజాగా ఆమె తుంగభద్ర పుష్కరాలు రద్దు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ఫైర్ అయ్యారు.
కరోనా కారణంగా ఈ ఏడాది తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం దాదాపుగా రద్దు చేసేసింది. కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో పుష్కరాల్లో పూజలు మినహా స్నానాలు, ఇతర కార్యక్రమాలు రద్దయ్యాయి. కానీ సీఎం జగన్ మాత్రం పుష్కరాల సందర్భంగా అక్కడకు చేరుకుని పూజల్లో పాల్గొనబోతున్నారు. దీంతో జగన్ కాన్వాయ్ను అడ్డుకుని తీరుతామని బైరెడ్డి శబరి హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం పుష్కర స్నానాలు అడ్డుకోవడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు.

వైసీపీ నాయకులు పాదయాత్రలు, బహిరంగసభలు పెట్టుకున్నప్పుడు కనిపించని కరోనా తుంగభద్ర నదిలో స్నానాలు చేస్తే వస్తుందా అని బైరెడ్డి కూతురు శబరి ప్రశ్నించారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా కర్నూలు వచ్చే సీఎం జగన్ను అడ్డుకుని తమ నిరసన తెలుపుతామని శబరి ప్రకటించారు. ఒకప్పుడు తన తండ్రి బైరెడ్డి రాజశేఖర్రెడ్డి కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ విషయంలో తీవ్ర వ్యాఖ్యలతో ఫైర్బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే కూతురు కూడా నిరసనలకు దిగుతుండటం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications